హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 10.50 లక్షల టన్నుల యూరియాను కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ఈ యూరియాను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నెలవారీగా సరఫరా చేస్తారని తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమై రాష్ట్రానికి కేటాయించిన యూరియాపై చర్చించారు. జూన్, జూలై నెలల్లో రాష్ర్టానికి 93 వేల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయిందని కేంద్రం దృష్టికి తెచ్చారు. దీన్ని ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో రావాల్సిన 4.5 లక్షల టన్నుల యూరియాతో కలిపి పంపాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చే యూరియాలోనూ తెలంగాణకు కోటా కేటాయించాలని కోరారు. దక్షిణాదిలో తొలుత తెలంగాణలోనే నాట్లు పడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా తెలంగాణకు యూరియా ఇవ్వాలని విన్నవించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, యూరియా విషయంలో తెలంగాణకు ఎట్టిపరిస్థితిలోనూ ఇబ్బంది రానివ్వబోమని హామీ ఇచ్చారని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ పనితీరు భేష్..
సీఎం కేసీఆర్ చక్కగా పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని మన్సుఖ్ మాండవీయ అభినందించినట్లు నిరంజన్రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సురేష్రెడ్డి, రాములు, బండ ప్రకాశ్, బడుగుల లింగయ్య, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.