అమరుల త్యాగఫలం.. ప్రజల పోరాట ఫలమే..
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండా విశ్వవ్యాప్తం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 27: గులాబీ జెండా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ జెండా విశ్వవ్యాపితమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలోని మన వారున్న ప్రతి చోటుకు, భూగోళంలో గాలి వీచే ప్రతి చోటుకు ఈ నినాదం చేరిందన్నారు. అది తెలంగాణ జెండాకు.. తెలంగాణ వాదానికి ఉన్న గొప్పతనమన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. అమరుల త్యాగఫలం.. కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పోరాట ఫలంతోనే తెలంగాణ ఏర్పాటైందన్నారు. ఉద్యమ సమయంలో ఎవరి పరిధి మేరకు వారు పోరాడుతూ కలిసి వచ్చారని, అది ఒక మహత్తరమైన పోరాటమని గుర్తు చేశారు. ఈ పోరాటానికి ఉన్న ప్రత్యేకతలు మామూలు కావని, మానవజాతి చరిత్రలోనే ప్రత్యేక పోరాటమని, సమస్త కళలు, సమస్త చైతన్య రూపాలు ఉద్యమంలో వెల్లివిరిశాయన్నారు.
దేశాన్ని తన వైపు తిప్పుకున్న ప్రాంతం తెలంగాణ అన్నారు. మరే రాష్ర్టానికి మరే పోరాటానికి ఇంత ప్రత్యేకత లేదని, కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో 36 పార్టీల మద్దతు సాధించుకొని మొత్తం పార్లమెంట్ మద్దతునే కూడుగట్టుకోవడం ఉద్యమనేత కేసీఆర్ రాజకీయ ప్రజ్ఞకు నిదర్శనమన్నారు. కేసీఆర్ అంటే వ్యక్తి కాదని కేసీఆర్ తెలంగాణ సమాజ చైతన్యానికి ప్రతీకన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరం ధన్యులం.. తెలంగాణ రాష్ట్ర సాధనకే ఒక శాశ్వత ప్రయోజనం, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధించిన ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని, తాగునీటి కష్టాలు తీరిపోయాయని పేర్కొన్నారు. దాదాపు కోటి ఎకరాలు సాగు చేసే పరిస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. వెయ్యికిపైగా గురుకులాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నా రు. మూస రాజకీయ పార్టీలకు తెలంగాణ విజయాలు అర్థం కావన్నారు.
ఇక్కడి సమాజం, తెలంగాణ ప్రజలు మాత్రం టీఆఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ఆదరిస్తురన్నారని, కారణాలు వారికి తెలుసన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే కొందరికి శాశ్వత ప్రయోజనాల గురించి అర్థం కాదన్నారు. ఎడారిని తలపించిన పాలమూరులో జలకళ ఉట్టిపడి, వేసవిలో చెరువులు అలుగులు పారుతున్నాయని, కరెంటు కష్టాల నుంచి రాష్ట్రం బయట పడిందని, దేశమే గర్వించదగిన సంక్షేమ పథకాల అమలులో ముందుందని వివరించారు. కరోనా విస్తరించకుండా ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన సూచించారు. మరో రెండు నెలలు ఎక్కడికక్కడ కట్టడయ్యేలా చూడాలని, అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మీ అందరి ఆశీస్సులు, అభిమానం ఎల్లవేళ్లలా పార్టీకి, నాయకత్వానికి ఇలాగే ఉండాలని మంత్రి కోరారు.