హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. గురువారం లక్షా 38వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఎగువన వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతున్నది. దీంతో ఆయా ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని వదులుతుండటంతో జూరాల దిశగా కృష్ణమ్మ చేరుకుంటున్నది. జూరాలకు 14,500 క్యూసెక్కుల ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే కడెం, ఎల్లంపల్లి, మూసీ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీబరాజ్కు వరద ఉధృతి పెరుగుతున్నది. గురువారం 1,58,320 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 38 గేట్లు ఎత్తి 1,69,84 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం (సరస్వతీ)బరాజ్లో అన్ని గేట్లు మూసివేశారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదిఒడ్డున గల పురాతన శివాలయం పూర్తిగా మునిగిపోయింది.