నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు సిహెచ్.మధు మృతి పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని ఆమె ట్వీట్ చేశారు.
సీహెచ్ మధు గత రెండు సంవత్సరలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మధు సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో నిమ్స్, నిజామాబాద్ ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స నిర్వహించగా కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారికి బలయ్యాడు. మధుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు విఠల్ కాగా, సాంస్కృతిక అభిమానులకు సిహెచ్.మధుగా సుపరిచితం. పాఠశాలలో చదివింది అంతంత మాత్రమే అయిన సమాజాన్ని చదివి డాక్టరేట్ పొందారు. మధుకు భార్య లింగవ్వ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
దేశపతి శ్రీనివాస్ సంతాపం
ప్రముఖ కవి, రచయిత, ప్రజల పక్షాన నిలిచిన సీనియర్ జర్నలిస్టు సిహెచ్.మధు అకాల మరణంపై సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఉద్యమకారులకు, జర్నలిస్టులకు, సాహిత్యకారులకు విషాదకరమైన విషయం అని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలిచిందని, తన భావజాలం ఏదైనా అందరి భావజాలాన్ని గౌరవించే ఉన్నత వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు.