న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని శుక్రవారం తెలిపింది. తక్షణం ధరల పెంపు అమలులోకి రానున్నది. పెంచిన ధరల ప్రకారం ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలు రూ.22,500 వరకు పెరుగుతాయి.
ముడి సరుకు, విడి భాగాల ధరలు పెరిగాయన్న సాకుతో గత జనవరిలోనే మారుతి సుజుకి సహా ఇతర ఆటోమొబైల్ సంస్థలు కార్లు, మోటారు బైక్లు, స్కూటర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మారుతి సుజుకి అదే కారణం పేర్కొంది.
వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగాయని మారుతి సుజుకి తెలిపింది. దీంతో ఎంపిక చేసిన కార్ల ధరలు పెరుగుతాయని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలోని షోరూమ్ ధరల ప్రకారం సగటున కొత్తగా కార్లు కొనుగోలు చేసే వారిపై 1.6 శాతం భారం పడుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్లో మారుతి వివరించింది.
సెలేరియో, స్విఫ్ట్ మోడల్స్ మినహా అన్ని మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని స్పష్టం చేసింది. ఇన్ఫుట్ వ్యయాలు పెరిగినందున ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలు పెంచక తప్పదని గత నెలలోనే సంకేతాలిచ్చింది.
ఈ ఏడాదిలో మారుతి సుజుకి తన కార్ల ధరలు పెంచడం జనవరి నుంచి ఇది రెండోసారి. ఎంపిక చేసిన మోడల్ కార్లపై సగటున రూ.34 వేల చొప్పున పెరిగాయి.
స్టీల్ వంటి ముడి సరుకు, గ్లోబల్ కమోడిటీ ధరలు నిలకడగా పెరుగుతుండటంతో కార్ల తయారీదారులపై భారం పడుతున్నది. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్లో సెమీ కండక్టర్ల కొరత కూడా అధిక వ్యయానికి కారణం అవుతున్నది.
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!