హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోటికి చేరువైందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. రెండురోజుల్లో ఈ రికార్డును సాధిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 97 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. ఇందులో 80 లక్షల మందికి పైగా తొలి డోసు తీసుకున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీలో 100 కేంద్రాల ద్వారా రోజూ కనీసం 1,500 మందికి టీకాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 24 మొబై ల్ వ్యాన్ల ద్వారా టీకాలు వేస్తున్నామని చెప్పారు. టీచర్లు గుర్తింపుకార్డులు చూపించి టీకాలు తీసుకోవచ్చని శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వైరస్ వేరియంట్ వెలుగు చూడలేదని వెల్లడించారు.
18-44 ఏండ్ల మధ్య గల హైరిస్క్ గ్రూప్వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బుధవారం రికార్డుస్థాయిలో లక్షా 67 వేలమందికి వ్యాక్సిన్లు వేశారు. ప్రభుత్వ పరిధిలో దాదాపు 1.39 లక్షల మందికి, ప్రైవేటు పరిధిలో 28 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం బులిటెన్లో వెల్లడించింది. వ్యాక్సిన్ వృథా కేవలం 0.12 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది.