హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, సెలూన్ల ద్వారా జీవనం కొనసాగించే వారికి 250 యూనిట్ల కరెంట్ బిల్లు రాయితీలకు సంబంధించి జూన్ 1 నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు మంత్రి గంగుల ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల రజకులకు, 70 వేల నాయీబ్రాహ్మణుల సెలూన్లకు లబ్ధి చేకూరనున్నదని వెల్లడించారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు 250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతినెలా ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. పథకాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ విధానాన్ని చేపట్టామని, ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం అనేక కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేపడుతున్నదని అన్నారు. బీసీ రిజర్వేషన్లు పదేండ్లపాటు పొడిగింపు అందులో భాగమేనని చెప్పారు. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు గంగుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
www.tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు, షాపు వివరాలు నమోదుచేయాలి. పేరు, జెండర్, మొబైల్, ఆధార్ నంబర్, కులధ్రువీకరణపత్రం, ఉపకులం, యూనిట్ పేరు, చిరునామాతో పాటు తన పేరున/అద్దె నివాసానికి చెందిన కరెంట్ మీటర్ నంబర్ వివరాలను ఎంటర్చేయాలి. తాజా కరెంటు బిల్లు, షాపు/యూనిట్ ఫొటో, షాపు అద్దె, నివాసంలో ఉంటే లీజు/అద్దె ఒప్పందం ఫొటోలు అప్లోడ్ చేయాలి. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చెందిన కార్మిక/వాణిజ్య లైసెన్స్ కాపీలను అప్లోడ్ చేసి స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకోవాలి.