వరంగల్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో ప్రజలకు మరో పెద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖాన సిద్ధం కానున్నది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎంజీ ఎం పాతది కావడం, రోగుల అవసరాలు తీర్చడం కష్టతరమవుతుండటంతో అతి సమీపంలోనే ఉన్న కేంద్ర కారాగార ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్యశాఖకు వెంటనే అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. తెలంగాణలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్లో అన్ని వైద్య విభాగాలకు సంబంధించిన సేవలతో అత్యంత సువిశాలమైన ప్రాంగణంలో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రామాణికమైన వైద్యసేవలు అందించడానికి వీలుగా ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పుడు ఉన్న సెంట్రల్జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని ప్రతిపాదించారు. ఇక్కడ జైలు నిర్మాణానికి దాదాపు రెండు వందల ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఖైదీల సంక్షేమంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా.. హైదరాబాద్ చర్లపల్లి తరహాలో వరంగల్ నూతన కేంద్ర కారాగారాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం వరంగల్ కేంద్రకారాగారం 73 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. దీన్ని ఆనుకొని ప్రసిద్ధ కాకతీయ మెడికల్ కళాశాల సేవలందిస్తున్నది. కరోనా నేపథ్యంలో కాకతీయ వైద్యకళాశాలలో సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. అటు వరంగల్ ఎంజీఎంలోనూ వైద్యసేవలు అత్యుత్తమంగా అందుతున్నాయి. కానీ.. చుట్టుపక్కల పలు జిల్లాల ప్రజలకు ఎంజీఎం సరిపోవడంలేదు. పైగా చాలా పాతబడిపోయింది. దీంతో.. తాజాగా 73 ఎకరాల జైలు స్థలంలో గుండె సంబంధమైన విభాగంతోపాటు.. అన్ని రకాల వైద్యసేవలను ప్రజలకు అందించేవిధంగా నూతన వైద్యశాలను నిర్మించనున్నారు. ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్, క్రిటికల్కేర్ వంటి సర్వీసులన్నీ అందుబాటులో ఉంటాయి. వైద్యపరంగా ప్రజలకు అవసరమైన పలు ల్యాబులు కూడా ఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ దవాఖాన నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలో అటు జైలు నిర్మాణం కూడా సమాంతరంగా పూర్తిచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. కేంద్రకారాగార ప్రాంగణంలో వైద్యశాల పూర్తయితే అతి పెద్ద వైద్య సేవల సముదాయం.. వరంగల్తోపాటు, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, జనగామ, ఆదిలాబాద్, మహబూబాబాద్, ములుగు.. తదితర జిల్లాల ప్రజలందరికీ చేరువ అవుతుంది. వైద్యసేవల కోసం తరచూ రాజధాని హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండదు.