స్పష్టంచేసిన హుజూరాబాద్ నాయకులు
మంత్రి హరీశ్రావును కలిసిన నేతలు
సిద్దిపేట, జూన్1( నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెంటే తామంతా ఉంటామని, టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు స్పష్టంచేశారు. మంగళవారం సిద్దిపేటలో ఆర్థికమంత్రి హరీశ్రావును జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు కలిశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణను సాధించి అన్ని వర్గాల సంక్షేమానికి పనిచేస్తున్నారని, ఆయన వెంటే తాము ఉంటామని నినదించారు. అనంతరం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అని, పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని సూచించారు. మంత్రికి కలిసిన వారిలో రెండు మండలాలకు చెందిన 30 మందికి పైగా నేతలు ఉన్నారు.
ఈటల ఏ పార్టీలోకి వెళ్లినా ఫరక్ పడదు: కడియం
తెలంగాణలో సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే నాయకులు, పార్టీలు లేవని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో మంగళవారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందించారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. బీజేపీకి పత్రికల ముందు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారని, కిందిస్థాయిలో కేడర్ లేదని చెప్పారు. గ్రామాల్లో వారికి ఓటుబ్యాంకు లేదని.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అది స్పష్టమైందని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి, మరో పార్టీలోకి వెళ్లినా పెద్దగా ప్రభావం ఉండదని పేర్కొన్నారు. వ్యక్తుల ద్వారా పార్టీలు బలపడతాయని అనుకోవడం తప్పన్నారు. ఒక వ్యక్తి పార్టీ మారినంత మాత్రాన ఆయనతోపాటు క్యాడర్, ఓటర్లు మారుతారు అనుకోవడం సరి కాదన్నారు.