హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రామగుండం వచ్చి మరీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన మోదీ.. నెల తిరగకుండానే మాట తప్పారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని బాల్కసుమన్ గుర్తుచేశారు.
ఈ మేరకు శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘గత నెల 12న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని పచ్చి అబద్ధాలు చెప్పిండు. కానీ ఇప్పుడు సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది’ అని బాల్క సుమన్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు విక్రయించవద్దని కోరుతూ గత సంవత్సరం డిసెంబర్ 7న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖను కూడా సుమన్ ట్వీట్ చేశారు.