తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 2 : రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఖాళీ పోస్టులతోపాటు అదనంగా మరో వెయ్యి పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. శుక్రవారం పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2020 ఏడాదికిగాను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ముదిగంటి సుజాతరెడ్డికి, 2021 ఏడాదికిగాను కళా విమర్శకుడు, బొబ్బిలి జమీందారి వంశీయుడు వీఏకే రంగారావుకు విశిష్ఠ పురస్కారాలను ప్రదానం చేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. మాతృభాష తెలుగును నేటితరం మరువొద్దని సూచించారు. త్వరలోనే బాచుపల్లికి తరలనున్న తెలుగు వర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానిద్దామని తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల వైపు ఆకర్షితులవుతున్న యువత మాతృభాషను మరువకుండా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకొంటూ తెలుగు భాషా వికాసానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం కోర్సులు స్వయం ఉపాధికే పరిమితం కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించేలా రూపొందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి తెలుగు వర్సిటీ నిరంతరం ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నదని తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు టీ కిషన్రావు వెల్లడించారు. ఎంఎఫ్ఏ, బీఎఫ్ఏ విద్యార్థులు రూపొందించిన కళాత్మక ఉత్పత్తులు, పెయింటింగ్ తదితర వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ఈ నెల 5వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.