హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ) / నెట్వర్క్: అల్పపీడన ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతున్నది. రాష్ట్రంలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి తోడు మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి వరద వస్తున్నది. ఎస్సారెస్పీతోపాటు ఎల్లంపల్లికి భారీగా వరద చేరుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీబరాజ్కు ప్రాణహిత నుంచి ప్రవాహం కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు 2,443 క్యూసెక్కులు వరద కొనసాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద చేరుతుండటంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
ఎగువ నుంచి వచ్చే వరద, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పరవళ్లు తొక్కుతున్నది. కడెం జలాశయం నుంచీ వరద వస్తుండటంతో జగిత్యాల జిల్లా ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద 7.68 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు నిండుకుండ్ల మారడంతో జూరాలకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో జూరాలలో విద్యుదుత్పత్తితోపాటు కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్కు స్వల్ప ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండటంతో బుధవారం ఏడు గేట్లను ఎత్తి నీటిని నదిలోకి వదిలారు.