హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులకు వాడే పారాసెటమాల్ వినియోగం కరోనా కారణంగా రెట్టింపు అయినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ సంబంధిత లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని భావించే ఈ ఔషధాన్ని ప్రభుత్వం కరోనా పాజిటివ్ వ్యక్తులకు అందించే కిట్లలో చేర్చింది. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారాసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో మొత్తం 4.81కోట్ల గోలీలను వినియోగించారు. వీటి ద్వారా కోవిడ్, కోవిడేతర వ్యాధుల బాధితులు 32 లక్షల మంది దాకా చికిత్స పొందారు. వీటికి ఎలాంటి కొరత రాకుండా వైద్యారోగ్యశాఖ ప్రతి 10 రోజులకు ఒకసారి కోటి గోలీల చొప్పున దవాఖానల్లో రీస్టాక్ చేసింది. ఇదే కాలానికి 1.03 లక్షల లివోసిట్రజిన్ గోలీలను ప్రజలు వేసుకున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 15,249 ఎన్-95 మాస్కులు, 34,221 సర్జికల్ మాస్కులు, 59 వేల సర్జికల్ గ్లోవ్స్, తదితర వైద్య పరికరాల వినియోగం జరిగినట్టు గణాంకాలు స్పష్టంచేశాయి.