ఒక్కసారిగా మొగులు విరిగి పడ్డట్టయింది. ఆకాశానికే చిల్లు పడ్డట్టు కుండపోతగా గుమ్మరించేసింది. రాష్ర్టాన్ని వాన ముంచెత్తింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాకలో 19.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వానలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లోనూ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సోమవారం కుండపోతగా వాన కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగడంతో అనేక చోట్ల రహదారులపై వాననీరు పారింది. హనుమకొండ, సిద్దిపేట, జనగామ, యాదా ద్రి భువనగిరి, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్లగొండ, కరీంనగర్, నాగర్కర్నూల్, వరంగల్, కామారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్నగర్, మెదక్, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) తెలిపింది. చాలా ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నది. మరో రెండ్రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఎస్ డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి బీఆర్కేభవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని పేర్కొన్నారు.
భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఏండ్లుగా నీటికి నోచుకోని చెరువులు సైతం నిండి కళకళలాడుతున్నాయి. పలుచోట్ల పంటలు మునిగాయి. వాగులు పొంగి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల రోడ్లపైకి వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో గోపాల్పూర్ వద్ద వాగు దిశ మారడంతో వరి పొలాలను వరదనీరు ముంచెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట, ఆలేరు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చండూర్ మండలంలోని కస్తాల, కనగల్ మండలం పొనుగోడుల్లో 20 ఏండ్ల తర్వాత చెరువులు మత్తడి దుంకుతున్నాయి. హాలియా, మైనంపల్లి, కనగల్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని కేశవాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయంగా మారింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని వసంత్ విహార్కాలనీలోని పలు ఇండ్లు నీట మునిగాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా, కేతిని వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచాయి. వర్షాలతో పత్తి, కంది, మక్కజొన్న, చెరుకు, వరి తదితర పంటలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు.
ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్ట్కు 14,947 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 18,632 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. శ్రీశైలానికి 16,691 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 12,713 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874.30 వద్ద ఉన్నది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా పెరగడంతో 5 క్రస్ట్గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఇన్ఫ్లో 13,178 క్యూసెక్కులు వస్తుండటంతో 12,938 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా శ్రీరాసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30,620 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి 37,420 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టం కలిగి ఉన్నది.
సరస్వతి బరాజ్లో 13 గేట్లు ఎత్తివేత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సరస్వతి బరాజ్లో 13 గేట్లు ఎత్తారు. బరాజ్కు 38,761 క్యూసెక్కుల నీరు రాగా, 46,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
సిద్దిపేట తడిసిముద్దయ్యింది.. 24 గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. గత కొన్నేండ్ల తర్వాత కురిసిన అతిపెద్ద వానతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. చెరువులు అలుగులు పోశాయి.. లోతట్టు ప్రాం తాలు జలమయం కాగా, జనజీవనం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మోయతుమ్మెద, కూడవెళ్లి వాగులు ఉప్పొంగాయి. శనిగరం ప్రాజెక్టు పరవళ్లు తొక్కింది. జిల్లాలో సరాసరిగా 13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నంగునూరు మండలంలో 16.23 సెంటీమీటర్లు, కొమురవెల్లి 13.38, , కోహెడలో 14.65, బెజ్జంకిలో 12.5, ధూళిమిట్టలో 11.28 , చిన్నకోడూరులో 11, కొండపాకలో 10.42 సెం.మీ.వర్షపాతం నమోదైంది. చిన్నకోడూరు మం డలం మల్లారంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె సివరేజి బోర్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో 6.6 కేవీ పంప్ హౌజ్ నీట మునిగింది. దీంతో హైదరాబాద్తోపాటు సిద్దిపేట, జనగామ, యాదా ద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 1950 హాబిటేషన్లకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
మంత్రి హరీశ్రావు పర్యటన
భారీ వర్షంతో సిద్దిపేటలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో హుజురాబాద్ పర్యటనలో ఉన్న ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుటాహుటిన బయలుదేరారు. మార్గమధ్యలో వాగులు పొంగిపొర్లడంతో మంత్రి వేరే మార్గంలో సిద్దిపేటకు చేరుకొని బాధితులను పరామర్శించారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలుచోట్ల వరద నీటిలో కొట్టుకుపోయి ఆరుగురు మృతిచెందారు. వికారాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ వాగులో ఆదివారం రాత్రి కారు గల్లంతయిన ఘటనలో నవ వధువు ప్రవళిక, ఆమె ఆడపడుచు శ్వేత మృతదేహాలు సోమ వారం ఉదయం లభ్యమయ్యాయి. వరుడు నవాజ్రెడ్డి, అతని అక్క రాధమ్మ, డ్రైవర్ రాఘవేందర్రెడ్డి రాత్రే బయటపడగా, నవాజ్రెడ్డి అల్లుడు శశాంక్రెడ్డి ఆచూకీ లభించలేదు. నవాబ్పేట మండలం పుల్మామిడి వాగులో కొట్టుకుపోయిన చాకలి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో కొట్టుకుపోయిన మోమిన్పేట మండలం ఎన్కతలకు చెందిన వెంకటయ్య (60) మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగులలో ఓ శుభకార్యానికి బైక్పై వస్తున్న జనగామ జిల్లా దేవురుప్పుల మండలం చిన్నమాడూరు ఎంపీటీసీ సుజాత-మల్లికార్జున్ల కూతురు సింధూజ (26), బొందుగులకు చెందిన పద్మ-ఆంజనేయులు కూతురు హిమబిందు (23) పాముకుం ట వద్ద దోసర వాగులో గల్లంతయ్యారు. సింధూజ మృతదేహం లభ్యంకాగా, హిమబిందు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
వరదలో చిక్కుకున్నవారిని కాపాడిన పోలీసులు
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని కల్వర్టు వద్ద వరద నీటిలో కారులో చిక్కుకున్న కూడవెల్లి సంతోష్, మురం భానును పోలీసులు కాపాడారు. హనుమకొండ అంబేద్కర్ భవన్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి మురుగు కాల్వలోకి దూసుకెళ్లగా, ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.