భైంసా, ఏప్రిల్, 22: ‘ఈ విపత్కర పరిస్థితుల్లోనూ మీసేవలు ఆదర్శనీయం. కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులకు ధైర్యంగా మీరందిస్తున్న సేవలు ప్రశంసనీయం’ అని భైంసా వైద్య సిబ్బందిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. గర్భిణులకు విజయవంతంగా సాధారణ కాన్పు చేసిన నిర్మల్ జిల్లా భైంసా ఏరియా దవాఖాన వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తిస్తూ గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ మొదటి పేజీలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెల్సిందే. ఎమ్మెల్సీ కవిత ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ వనిత ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఈ మేరకు గురువారం ఆమె వైద్యులు, సిబ్బంది సేవలను ట్విట్టర్ ద్వారా కొనియాడారు.
జర్నలిస్టులను ఆదుకుంటాం..
మంచిర్యాల నమస్తే తెలంగాణ/హాజీపూర్ : మంచిర్యాల జిల్లా హిందీమిలాప్ స్టాఫ్ రిపోర్టర్ కొండ్ర శ్రీనివాస్ గౌడ్ కరోనా నుంచి త్వరగా బయటపడతారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయనకు అందుతున్న వైద్యంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. జర్నలిస్టులను తప్పక ఆదుకుంటామని కవిత స్పష్టం చేశారు.