హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): వైద్యులు రోగులకు రాసే మెడికల్ ప్రిస్క్రిప్షన్లో కంపెనీల బ్రాండ్ పేర్లను కాకుండా కేవలం ఔషధాల జనరిక్ పేర్లను మాత్రమే రాయాలని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లోకాయుక్తకు ఇచ్చిన వివరణ మేరకు టీఎస్ఎంసీ రిజిస్ట్రార్ సీహెచ్ హనుమంతరావు ఈ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని డాక్టర్స్ అసోసియేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, విభాగాధిపతులు, సూపరింటెండెంట్లు, మెడికల్ డైరెక్టర్లకు సర్క్యులర్ జారీచేశారు.
సాధారణంగా వైద్యులు తమ మెడికల్ ప్రిస్క్రిప్షన్లో ఔషధ కంపెనీల బ్రాండ్ పేర్లను రాస్తుంటారని, తద్వారా వారు కొన్ని బ్రాండ్ల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ డాక్టర్ ఆకుల సంజయ్రెడ్డి అన్నారు. ఉదాహరణకు జ్వరం వచ్చిన రోగికి సాధారణంగా డాక్టర్లు డోలో-650, లేదా క్రోసిన్ లేదా ఫిపనిల్ వంటి మందులు రాస్తుంటారని తెలిపారు. ఇవన్నీ ఆయా కంపెనీల బ్రాండ్ల పేర్లని చెప్పారు. ఇక నుంచి జ్వరం వచ్చిన రోగికి ‘పారసిటమాల్’ అనే జనరిక్ పేరు మాత్రమే రాయాలని టీఎస్ఎంసీ ఆదేశించినట్లు తెలిపారు.