హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నూతన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే కిషోర్గౌడ్లను సభ్యులుగా, కమిషన్ సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్గా నియమితులైన వకుళాభరణం, సభ్యులుగా నియమితులైన శుభప్రద్ పటేల్, కే కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసి బీసీ కులాలకు న్యాయం చేస్తామని తెలిపారు. స్వరాష్ట్ర ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సుదీర్ఘకాలంపాటు జరిగిన ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా తమతమ ప్రాంతాల్లో భావజాల వ్యాప్తికి కృషి చేసినవారికి, సమైక్యపాలకుల దమననీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినవారికి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. అంతేకాకుం డా విధేయులుగా ఉన్నవారికి అవకాశాలు తప్పకుండా వస్తాయని, పార్టీ అధిష్టానం, ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని బీసీ కుమిషన్ కూర్పు స్పష్టంచేస్తున్నది.
రచయిత, ఉద్యమకారుడు వకుళాభరణం
బీసీ కమిషన్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వకుళాభరణంను ప్ర భుత్వం కమిషన్ చైర్మన్గా నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 వరకు రెండుసార్లు, స్వరాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా 2016-19 మధ్యకాలంలో పనిచేశారు. విద్యార్థి సమస్యలపై పోరాటం మొదలు పెట్టి న ఆయన ఒక రచయితగా, వ్యా సకర్తగా, ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, బీసీ కమిషన్ సభ్యుడిగాఎదిగారు. బీసీ ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ సీనియర్ నేతగా అందరికీ సుపరిచితులే. ఓయూ నుంచి ఎంఏ (తెలుగు) పూర్తి చేసి ‘దశాబ్ది కవిత్వం (1991-2000) పరిశీలన’ అనే అంశంపై పీహెచ్డీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి కావడం.. అందులోనూ కరీంనగర్ కొత్తజిల్లాకు తొలిసారిగా ఉన్నతమైన పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సామాజిక సమతూకం -ఉద్యమ నేపథ్యం
బీసీ కమిషన్ ఏర్పాటులో ఓ వైపు సామాజిక సమతూకాన్ని పాటిస్తూ.. మరోవైపు ఉద్యమ నేపథ్యానికి తగిన గుర్తింపు కల్పించారు. బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన డాక్టర్ వకుళాభరణం అత్యంత వెనుకబడిన (ఎంబీసీ) ‘దాసరి’ కులానికి చెందినవారు. వకుళాభరణం నియామకంతో ఎంబీసీలకు ఉన్నతపదవి లభించినట్టు అయింది. ఇక సభ్యులుగా నియమితులైనవారిలో వికారాబాద్ జిల్లా ఆలంపల్లికి చెందిన శుభప్రద పటేల్ వీరశైవ లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్కు చెందిన న్యాయవాది సీహెచ్ ఉపేంద్ర కమ్మరి సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంబీసీ సంక్షేమ సమితి వ్యవస్థాపకుడిగా సుపరిచితులు. హైదరాబాద్ జిల్లా అంబర్పేటకు చెందిన కే కిశోర్గౌడ్ ఉన్నత విద్యావంతుడిగా, విద్యార్థి నేత గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
బీసీ కమిషన్ ఏం చేస్తుంది?
బీసీ కమిషన్కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉం టాయి. రాష్ట్ర బీసీ కులాల జాబితాలో మార్పులు, చేర్పుల కోసం విచారణ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ప్ర భుత్వ, ఎయిడెడ్ విద్య, ఉద్యోగరంగాలకు సంబంధించి రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్లు సక్రమంగా పాటించేలా చూస్తుంది. వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిస్తుంది. అవసరమైన సందర్భాల్లో కమిషన్ సుమోటోగా జోక్యం చేసుకుంటుంది. బీసీ అంశాలపై ప్ర భుత్వం కోరే లేదా ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా మధ్యంతర నివేదికలను సమర్పిస్తుంది.
అరుదైన అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
కమిషన్ చైర్మన్గా నియమించి అరుదైన గౌరవం, గుర్తింపును ఇచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు రుణపడి ఉంటా. కమిషన్ చైర్మన్ హోదాలో వెనుకబడిన వర్గాలు సమున్నతంగా ఎదగడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉదాత్తమైన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో నిజమైన పేదలకు అందటంలో కమిషన్
తనవంతు కృషిని నిబద్ధతతో కొనసాగిస్తుంది.
సభ్యులుగా ఉన్నత విద్యావంతులు
శుభప్రద్ పటేల్: వికారాబాద్ జిల్లా ఆలంపల్లికి చెందిన శుభప్రద్ పటేల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం పూర్తిచేసి ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
కే కిషోర్గౌడ్: హైదరాబాద్ అంబర్పేటకు చెందిన కిశోర్గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, బీఎడ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్వీలో పనిచేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. విద్యార్థి సమస్యలపై 2004 నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
సీహెచ్ ఉపేంద్ర: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్కు చెందిన న్యాయవాది సీహెచ్ ఉపేంద్ర ఎంఏ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదిగా క్రియాశీలంగా పనిచేశారు. న్యాయవాదుల చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జంతర్మంతర్ దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ విభాగాల్లో పనిశారు.