నిజామాబాద్, మార్చి 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్- లోహాలో జరిగిన విరాట్ జాహీర్ సభకు విశేష స్పందన వచ్చింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అర గంటకు పైగా చేసిన ప్రసంగాన్ని ప్రజలంతా ఆసక్తిగా విన్నారు. ప్రతి వ్యాఖ్యకు ప్రతిస్పందనగా జవాబిచ్చారు. హిందీలో సాగిన కేసీఆర్ స్పీచ్కు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. పలు సందర్భాల్లో కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ప్రజలు అదేస్థాయిలో బిగ్గరగా జవాబిచ్చారు. బీజేపీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఇచ్చిన కౌంటర్తో కరతాళ ధ్వనులు మార్మోగాయి. సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విసిరిన పంచులకు పలుమార్లు ప్రజలంతా నవ్వులు పూయించారు.
రైతులకు పెద్దన్న సీఎం కేసీఆర్. మాలాంటోళ్ల కోసం ఆయన తెలంగాణలో ఎంతో చేస్తున్నాడని విన్నాం. మాకు కూడా అలాంటి ప్రయోజనాలు దక్కాలని కేసీఆర్ నాయకత్వానికి మద్దతునిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే శంకరన్న లాంటి నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఆయనను మేం బలపరుస్తున్నాం.
– దత్తారామ్రావు షిండే, హల్దార్, లోహా తాలూకా
మేము వ్యవసాయం చేసి బతుకుతాం. ఇది తప్ప మాకు వేరే మార్గం లేదు. ఇక్కడ ఏడాదికి ఒకేసారి పంటలు పండుతాయి. నీళ్లు కూడా సక్కగా లేవు. కేసీఆర్ లాంటి నాయకుడుంటే మా ప్రాంత బాధలు పోతాయి. అందుకే కేసీఆర్ను చూసేందుకే ఇక్కడికి వచ్చాను.
– దశరథ్ పవార్, మహారాష్ట్ర వాసి
కేసీఆర్నే ఖేత్వాలోకే లియే బహుత్ కామ్ కర్ రహేహై. ఇనో భగవాన్కే స్వరూప్ హై. మై ఉన్కే లియే ఇత్నా దూర్ ఆయా హూ. కేసీఆర్ అచ్చీ తరహ్ సే కామ్ కర్ రహేహై. సబ్ లోగోకే లియే సోచ్తేహై. ఐసే నేతా దేశ్మే కహాబీ నహీ హై.
– అశోక్ తులసీరాం జాదవ్, హడ్గావ్, లోహా
సీఎం కేసీఆర్ మంచి పనులు చేస్తున్నారని చాలారోజుల నుంచి వింటున్నాం. కొద్ది రోజులుగా ఇక్కడ కూడా ప్రచారం జోరుగా నడుస్తున్నది. నాందేడ్ సభతో మాకు కూడా సమాచారం అందింది. లోహాకు కేసీఆర్ రావటం ఆనందంగా ఉన్నది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కే జై కొడతాం.
– అశోక్ బాబురావు, శాన్వాడే
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ వేదికైంది. దయనీయమైన సాగు విధానాలతో మహారాష్ట్రలోని రైతులు కుదేలవుతున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో వ్యవసాయ రంగం బాగుపడింది. ఇక్కడా కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది.
– ముకున్ బాలాజీ పవార్, రైతు
ఇంత పెద్ద సభ గతంలో ఎన్నడూ చూడలేదు. మా దగ్గర ఇలాంటి ఏర్పాట్లు కూడా కనీవినీ ఎరుగం. ఇంత పెద్ద సభను చూస్తామని అనుకోలేదు. వచ్చిన వారిని అందరినీ మంచిగా చూసుకున్నారు. ఇక్కడ ఇలాంటి మీటింగ్లు చాలా జరిగినాయి. కానీ, బీఆర్ఎస్ మీటింగ్ అన్నింట్లో టాప్.
– షేక్ రసూల్, దేవుల్గావ్, లోహా
బైల్ బజార్ మైదానంలో జరిగిన కేసీఆర్ సభ ఊహించని విధంగా జరిగింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఏర్పాట్లతో ఎప్పుడూ మీటింగ్ జరగలేదు. ప్రధాని మోదీ వచ్చినా కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయలేదు. మొదటిసారి కుర్చీలు వేసి పబ్లిక్ను గౌరవించిన పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే.
– వామన్ పంచల్, దేవుల్గావ్
నా జీవితంలో చాలామంది లీడర్లను చూసినా. పార్టీలను చూసినా. ప్రజలను పట్టించుకున్నోళ్లే లేరు. కానీ, తెలంగాణ మాదిరిగా మాకు కూడామంచి పరిపాలన అందించేందుకు వస్తున్న కేసీఆర్ను తప్పకుండా అక్కున చేర్చుకుంటాం. కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం.
– శివాజీ జోండే, లోహా వాసి