ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 6: ఇక నుంచి పీహెచ్డీ ఏండ్లకు ఏండ్లు చేస్తూ కూర్చుంటామంటే కుదరదు. తప్పనిసరిగా ఆరేండ్లలోపే పరిశోధన పూర్తి చేసి, థీసిస్ సమర్పించాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఈ మేరకు సంస్కరణలు తీసుకొస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఫుల్ టైమ్లో పీహెచ్డీ పూర్తి చేసేందుకు నాలుగేండ్లు సమయం ఇస్తారు. కుదరని పక్షంలో కాలవ్యవధిని మరో రెండేండ్లు పొడగిస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ గడువును పొడగించరు. ఇప్పటివరకు అదనపు సమయాన్ని కొరే విద్యార్థులు యూనివర్సిటీ డీన్కు దరఖాస్తు చేసుకునేవారు. విశ్వవిదాలయ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకొని వారికి గడువు పెంచేవారు. ఇప్పుడా పద్ధతికి ఓయూ గుడ్బై చెప్పింది. పీహెచ్డీ పూర్తి చేసేందుకు ఉన్న నిబంధనలు మాత్రం యథావిధిగా అమల్లో ఉంటాయి. థీసిస్ సమర్పించేందుకు మూడు సెమినార్లు నిర్వహించటంతో పాటు, గుర్తింపు పొందిన జర్నల్స్లో రెండు పరిశోధన పత్రాలు ప్రచురితమై ఉండాలి. దాంతో పాటు పరిశోధన గ్రంథానికి యాంటి ప్లాగరిజం రిపోర్టును జత చేయాలి. ఇవన్నీ ఉంటేనే థీసిస్ను సమర్పించేందుకు అనుమతిస్తారు.
పాతవన్నీ డిసెంబర్ 31లోగా సమర్పించాల్సిందే
మార్చి 2017 కంటే ముందు పీహెచ్డీలో చేరిన వారంతా డిసెంబర్ 31లోగా థీసిస్ సమర్పించాల్సిందేనని అధికారులు ఆదేశించారు. లేకపోతే వారి ప్రవేశం రద్దు చేస్తామని స్పష్టంచేశారు. పరిశోధన పూర్తి చేసేందుకు చాలా సమయం ఉండటంతో పరిశోధన అంశం, టైటిల్ మార్పునకు అవకాశం లేకుండాపోయింది. పీహెచ్డీ సూపర్వైజర్ను కూడా మార్చేందుకు అవకాశం లేదని అధికారులు నిర్దేశించారు. థీసిస్ను గడువులోపు సంబంధిత డీన్ కార్యాలయంలో సమర్పించాల్సిందేనని ఆదేశించారు.
కొత్త విద్యార్థులకు అవకాశం కల్పించేందుకే..
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా వర్సిటీలో పరిశోధనలు చేసేందుకు ఎంతోమంది ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. పీహెచ్డీ సూపర్వైజర్లకు ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో పరిశోధక విద్యార్థులు ఉంటున్నారు. దీంతో కొత్త విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూజీసీ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే పరిశోధక విద్యార్థులను కేటాయిస్తూ, నియమిత సమయంలోనే పరిశోధనలు పూర్తి చేసేందుకు తాజా నిర్ణయాలు తీసుకున్నాం. పరిశోధక విద్యార్థులు ఈ మేరకు సంబంధిత సూపర్వైజర్, అధికారులకు సహకరించి, ఇచ్చిన సమయంలో పరిశోధనలు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. – ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్, ఓయూ