హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే ఈటల రాజేందర్ ఎక్కడ ఉండేవారని ఎైక్సెజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై ఈటల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కేసీఆర్తో ఆరేండ్లుగా గ్యాప్ ఉంటే మంత్రి పదవి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రిగా పనిచేసిన హరీశ్రావును కాదని, ఈటలపై నమ్మకంతోనే ఫ్లోర్లీడర్గా అవకాశం ఇచ్చి కేసీఆర్ గౌరవించారని గుర్తుచేశారు.
ఈటల తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, కాలేరు వెంకటేశ్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్లోకి రాకముందు ఈటల పరిస్థితి, వచ్చిన తర్వాత ఎంతగా ఎదిగారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. నచ్చని, మెచ్చని పార్టీలోకి ఈటల వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించుకోవాలని సూచించారు. వరవరరావును జైల్లో పెడి తే కేసీఆర్ పరామర్శించలేదంటున్న ఈటల, ఆయనను జైల్లో పెట్టిన పార్టీలో ఎందుకు చేరుతున్నారని నిలదీశారు.
టీఆర్ఎస్, కేసీఆర్ లేకుం డా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఈటల గెలిచారా అని ప్రశ్నించారు. ఈటల ఫ్రస్టేషన్తో మాట్లాడుతున్నారని, హుజురాబాద్లో అభివృద్ధి చేసేపార్టీకి.. అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు పోటీ ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన ఘనతను ఈటలకే కేసీఆర్ కట్టబెట్టారని తెలిపారు. నాడు బీజేపీ భూస్థాపితం అవుతుందన్న ఈటల, ఆ పార్టీలో ఎలా చేరుతున్నారో చెప్పాలని నిలదీశారు. హుజూరాబాద్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందన్న ఈటల, ఆ యుద్ధంలో ఆయన పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ను అసెంబ్లీసాక్షిగా అనేకమార్లు పొగిడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. ఇన్నాళ్లు ఈటలను పెంచి పోషించిన కేసీఆర్పై అభాండాలు వేయడం సరికాదన్నారు. ఈటలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా అని, మంత్రి పదవి ఇచ్చారు చాలదా అన్నారు. బీజేపీలో చేరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయప్రాజెక్టు హోదా సాధిస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో బడుగు బలహీనవర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో ఉన్నారని ఎంపీ బండ ప్రకాశ్ చెప్పారు.