మహబూబ్నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం మధ్యాహ్నం 8 గేట్లు తెరిచి 42,940 క్యూసెక్కులు దిగువనకు వదిలారు. ఆల్మట్టి డ్యాంకు 75,278 క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 40 వేల క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 519.60 మీటర్లు కాగా.. ప్రస్తుతం 517.33 మీటర్లకు చేరింది. సామర్థ్యం 123.08 టీఎంసీలకు 88.630 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్కు భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో జూరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి జలాలు జూరాలకు చేరుకునే అవకాశం ఉందని ప్రాజెక్టు ఏఈఈ బీచుపల్లి తెలిపారు. జూరాల డ్యాం సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.188 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
కాళేశ్వరం, జూన్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి బరాజ్ గేట్లను బుధవారం సాయంత్రం అధికారులు మూసివేశారు. ప్రాణహిత నది నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గేట్లు బంద్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, లక్ష్మి పంప్హౌస్లో పది మోటార్ల ద్వారా సరస్వతి బరాజ్లోకి నిత్యం రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు.