హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకే ప్రధానోపాధ్యాయ (హెచ్ఎం) పోస్టును మంజూరుచేయాలని విద్యాశాఖ భావిస్తున్నది. విద్యార్థుల సంఖ్యను బట్టి హెచ్ఎం పోస్టులను నిర్ణయించనున్నట్టు తెలిసింది. ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను మంజూరుచేస్తామని సీఎం కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న ప్రధానోపాధ్యాయులను కలుపుకొని 10 వేలవరకు ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు ఇస్తామని తెలిపారు. దీనిపై కసరత్తు మొదలుపెట్టిన విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను బట్టి హెచ్ఎం పోస్టులను మంజూరుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దాంతో 5,571 కొత్త పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 18,240 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి. 1997లో జీవో-400 ప్రకారం బాలికల అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలకు 10,647 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను మంజూరుచేశారు. అప్పట్లో 150 మంది విద్యార్థులున్న స్కూళ్లకు హెచ్ఎం పోస్టును ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత మనరాష్ట్రంలో ప్రస్తుతం 2,386 మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పనిచేస్తున్నారు. 1,821 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని పదోన్నతుల ద్వారా భర్తీచేసి కొత్తగా 5,571 హెచ్ఎం పోస్టులను సృష్టించనున్నారు.