హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కార్గో సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే కార్గోద్వారా రవాణా చేసే సరుకును ఇతరదేశాలకు ఎగుమతిచేసేలా జీఎంఆర్తో ఒప్పందం చేస్తుకున్న ఆర్టీసీ.. తాజాగా రైతుల ఉత్పత్తులను కల్లాల నుంచే నేరుగా మార్కెట్కు రవాణా చేస్తున్నది. అతితక్కువ ధరకే రైతు ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా అన్నదాతకు అండగా నిలుస్తూ.. సంస్థకూ ఆదాయం సమకూర్చుకుంటున్నది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఒప్పందం కూడా చేసుకున్నారు. కార్గోద్వారా సరుకు రవాణా చేసుకోవడానికి మండలాలు, గ్రామాలవారీగా మార్కెటింగ్శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కార్గో ద్వారా తక్కువ ఖర్చుతోనే సరుకు రవాణా చేసుకొనే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. రైతు కల్లాల నుంచి పంటను మార్కెట్కు తీసుకెళ్లేందుకు 50 కిలోమీటర్ల వరకు పన్నెండు టన్నుల సరుకుకు రూ.4,420 మాత్రమే చార్జి వసూలు చేస్తున్నారు. సింగిల్ ట్రిప్పుకు మాత్రమే ఆర్టీసీ కార్గో సరుకు రవాణా చార్జీలు వసూలు చేస్తున్నది. దీని వల్ల ఆర్టీసీ ఆదాయం సమకూరడంతో పాటు అతి తక్కువ ఖర్చుతోనే కల్లాల నుంచి మార్కెట్ వరకు రైతులు సరుకు రవాణా చేసుకోవడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని ఆర్టీసీ కార్గో ఇన్చార్జి కృష్ణకాంత్ తెలిపారు. రైతు కల్లాల నుంచే పంట ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా రైతులకు దళారుల బెడద తప్పుతున్నదని.. నేరుగా మార్కెట్కు తరలించడంతో గిట్టుబాటు ధర లభిస్తున్నదని చెప్పారు.
కార్గో ద్వారా మామిడి రవాణా
ఆర్టీసీ కార్గో ద్వారా జిగిత్యాల, కోరుట్ల ప్రాంతాల నుంచి మామిడి ఎక్కువగా రవాణా అవుతున్నది. దీంతో మామిడి రైతులకు అతి తక్కువ ధరలోనే సరుకు రవాణా చేయడంతో పాటు గిట్టుబాటు ధర వస్తుంది. పైగా అనుకున్న సమయానికే పంట మార్కెట్కు చేరుకుంటుంది. సూర్యాపేట జిల్లా నుంచి నిమ్మ, బత్తాయి పంటను మార్కెట్లకు చేరవేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయలు, మిరప, పత్తి, మొక్కజొన్న ఇలా పంట ఏదైనా సరుకు రవాణా సేవలందించేందుకు కార్గో సర్వీసులు సిద్ధంగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
ఆర్టీసీ కార్గోలో పాఠ్యపుస్తకాలు
తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం
ఆర్టీసీ కార్గో సేవలు అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయి. సరుకు రవాణాలో ప్రైవేటు పార్సిల్ సర్వీసులను దాటేసిన ఆర్టీసీ.. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలను కూడా రవాణా చేయనున్నది. ముద్రణా సంస్థల నుంచి నేరుగా జిల్లాల్లోని యూనిట్లకు పుస్తకాలను చేర్చనున్నది. వీలైతే మండలాలు..అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు కూడా పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్నది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల వరకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేస్తున్నది. గతంలో లారీలు, డీసీఎంల ద్వారా పంపిణీ చేయాల్సి వచ్చేది. రవాణాకు ప్రైవేటు వాహన యజమానులు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసేవారు. దీంతో విద్యాశాఖకు పుస్తకాల పంపిణీ ఆర్థిక భారంగానే ఉండేది. ఆర్టీసీ కార్గోలో రవాణాతో సగానికి సగం భారం తగ్గనున్నదని అధికారులు చెప్తున్నారు.
విక్రయించే పుస్తకాలు కూడా..
ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం సేల్ పుస్తకాలను ఆయా ముద్రణ సంస్థలకు అప్పగించారు. ముద్రణ సంస్థల నుంచి పబ్లిషర్లు, గుర్తించిన బుక్స్టాళ్లకు చేర్చడానికి కూడా ఆర్టీసీ పార్సిల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని కార్గో అధికారులు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పుస్తకాలను కార్గో ద్వారా సరఫరాకు తెలుగు అకాడమీ అధికారులు ముందుకొచ్చారు. తెలుగు అకాడమీ ముద్రించిన యూనివర్సిటీల పుస్తకాలు కూడా కార్గో వెళ్లనున్నాయి. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమశాఖకు సంబంధించిన కొన్ని రకాల వస్తువులు జిల్లా యూనిట్లకు పంపిణీ చేయడానికి కార్గో సేవలు ఉపయోగించుకుంటున్నట్లు కార్గో ఇంచార్జి కృష్ణకాంత్ తెలిపారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించి..
భవిష్యత్తులో టెన్త్, ఇంటర్, ఎంసెట్ వం టి పలు రకాల పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాలు, ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు ఒక చోటు నుంచి మరొక చోటుకు పంపిణీ చేయడానికి కార్గో సన్నద్ధమైందని కార్గో ఇంచార్జి కృష్ణకాంత్ తెలిపారు. కనీసం 10 టన్నులకు పైగా పుస్తకాలు లేదా సరుకు రవాణా చేస్తే కార్గో ద్వారా అతి తక్కువ ఖర్చవుతుందని..పైగా దీనివల్ల విద్యాశాఖకు సరు కు రవాణా భారం తగ్గడంతో పాటు ఆర్టీసీ కూడా ఆదాయ మార్గంగా మారనున్నది.