హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో జవహర్రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 500 నుంచి వెయ్యి మందికి స్వామి దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతోపాటు త్వరలో ఆన్లైన్లో జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇదుకోసం టీటీడీ వెబ్సైట్లో ప్రత్యేక పోర్టల్ను రూపొందించారు. శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద సోమవారం రాత్రి తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల వారికి సైతం సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్టు టీటీడీ ప్రకటించడంతో భక్తులు భారీసంఖ్యలో వచ్చారు. వీరిని నియంత్రించేందుకు అధికారులు ఇబ్బందిపడ్డారు.