హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల అవసరాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రూ.273 కోట్లు విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు రూ.232 కోట్లు, మండల పరిషత్లకు రూ.27 కోట్లు, జెడ్పీలకు రూ.14 కోట్లు కేటాయించారు. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక సంస్థలకు ఈ ఏడాది మొత్తం రూ.1,365 కోట్లు కేటాయించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఇందులో పంచాయతీలకు రూ.1,160.24 కోట్లు (85 శాతం), మండల పరిషత్లకు రూ.136.49 కోట్లు (10 శాతం), జిల్లా పరిషత్లకు రూ.68.25 కోట్లు (5 శాతం) కేటాయించారు.
నిధుల విడుదలపై కేసీఆర్కు కృతజ్ఞతలు: మంత్రి ఎర్రబెల్లి
కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీలకు నిధులను విడుదలచేసినందుకు సీఎం కేసీఆర్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతి కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తొలివిడతగా రూ.273 కోట్లను ప్రభుత్వం విడుదలచేసినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పల్లె ప్రగతి ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు రూ.5,761 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి ద్వారా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.