హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రజలు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉన్నారని శాసనమండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని చిన్నచూపు చూడొద్దని ఆయన కోరారు. మంగళవారం లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో లాక్డౌన్ విధించడం వల్ల కరోనా సెకండ్వేవ్ను కట్టడి చేశారని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న కష్టకాలంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తాము అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించామని ప్రొటెం చైర్మన్ వివరించారు. కరోనా తీవ్రత, పాజిటివ్ కేసులు భారీగా తగ్గటం వల్ల ఇటీవలే ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో పరిపాలన ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నదని అన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని భూపాల్రెడ్డి తెలిపారు. రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉండాలని ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.