సిద్దిపేట జోన్, మే 13: ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేటలో సీటీ స్కానింగ్ రేట్లు భారీగా తగ్గాయి. రూ.5,500 ఉన్న రేట్లు రూ.2 వేలకు దిగివచ్చాయి. గురువారం సిద్దిపేటలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రైవేటు సీటీ స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో మంత్రి హరీశ్రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సమయంలో బాధితులకు ఆర్థికభారం కాకుండా రేట్లకు సగానికిపై తగ్గించాలని కోరారు. దీనికి నిర్వాహకులు సానుకూలంగా స్పందించటంతో వారిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని సీటీ స్కానింగ్ ద్వారా రోజుకు 6, 7 పరీక్షలకు మించి చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్య కళాశాలలో చేరిన రోగులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని కళాశాల డైరెక్టర్ చెప్పగా.. అవుట్ పేషెంట్లకు కూడా రూ.2 వేల రుసుంతో సీటీ స్కానింగ్ పరీక్షలు చేపట్టాలని హరీశ్రావు ఆదేశించారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు అవసరమైన మందులు సంగారెడ్డి సెంట్రల్ స్టోర్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి నేరుగా అందించేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు అంగీకరించారని మంత్రి తెలిపారు. త్వరలోనే సిద్దిపేటలో సెంట్రల్ స్టోర్ ఏర్పాటుచేస్తామని తెలిపారని చెప్పారు.