నల్లగొండ: తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ సెప్టెంబర్ 17ను ఒక ఆట వస్తువులా ఆడుకుంటున్నదని శాసనమండలి మాజీ చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్తో బీజేపీకి ఏం సంబంధముందని ప్రశ్నించారు. ఆయనను తమ పార్టీకి చెందిన నాయకుడిగా ప్రచారం చేసుకుటున్నారని విమర్శించారు. మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కూడా సెప్టెంబర్ 17 గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నదని, ఇది సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.
బీజేపీ పార్టీ హిందుత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఏంఐఎం పార్టీని బూచిగా చూపెట్టి హిందువులను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆ పార్టీకి స్థానం లేదన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఆయన బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.