హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పుష్కలమైన నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరాతో తెలంగాణలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ రైతుల్లో సాగుపై భరోసా పెరిగిందని.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరిపి, వారికి భవిష్యత్తుపై భద్రత కల్పించాలని కోరారు. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. సోమవారం సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.
రాష్ట్రం నుంచి దొడ్డు బియ్యం సేకరణపై చర్చించారు. దేశంలో పంట మార్పిడి జరగాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా కేంద్రమంత్రి గోయల్ సూచించారు. అనేక రాష్ర్టాలు వరి పండిస్తున్నాయని.. గోధుమలు ఎక్కువగా పండే పంజాబ్ కూడా ఒక పంటగా ధాన్యాన్ని పండిస్తున్నదని చెప్పారు. దీంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. దీనికి త్వరలో పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. పంటల మార్పిడిపై తెలంగాణ కూడా ఆలోచన చేయాలని సూచించారు.
కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ అనంతరం.. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని.. ఏడేండ్లుగా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి సౌకర్యం పెరిగిందని చెప్పారు. రైతాంగానికి 24 గంటల కరెంటు, రైతుబంధు వంటి చర్యలతో రాష్ట్ర రైతాంగం గర్వంగా, ధైర్యంగా సాగు చేస్తుండటంతో పుషలంగా పంటలు పండుతున్నాయని తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రులు, అధికారులు ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. కొవిడ్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పంటను కొనుగోలు చేసిందని, దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే
వానకాలం, యాసంగి ఏ సీజన్లోనైనా ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదేనని వినోద్కుమార్ తెలిపారు. ఎఫ్సీఐ ద్వారా కేంద్రం ధాన్యం సేకరిస్తుందని చెప్పారు. కానీ, ధాన్యాన్ని కొనుగోలు చేయలేమంటూ ఎఫ్సీఐ గత కొన్నిరోజులుగా లేఖలు రాయడం మొదలు పెట్టిందన్నారు. ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్ వరుసగా రెండ్రోజులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిశారని చెప్పారు. ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎఫ్సీఐ అధికారులు కొంత సమాచారం కావాలని అడిగారని తెలిపారు. శాసనసభ జరుగుతున్న సమయంలోనూ సీఎం ఢిల్లీలోనే ఉండి సమస్య పరిషారం కోసం చూస్తున్నారని చెప్పారు. ఎఫ్సీఐ ఎంత ధాన్యం సేకరిస్తుందో రైతులకు చెప్పాలని భావిస్తున్నారని తెలిపారు.
ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని.. దీనిపై సోమవారం మంత్రి పీయూష్గోయల్కు విజ్జప్తి చేశారని వివరించారు. గతం కంటే ధాన్యం ఉత్పత్తి ఐదురెట్లు పెరిగిందని.. గోడౌన్లు పూర్తిగా నిండిపోయాయని, నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని కేంద్రం చెప్తున్నదని.. ఈ సమస్యకు ఏ పరిషారం చూపుతుందా అని ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ఎంపీలు సురేష్రెడ్డి, నామా నాగేశ్వర్రావు, ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, పౌరసరఫరాల సంస్థ అధికారులు పాల్గొన్నారు.