వకీల్సాబ్ డైలాగ్ రైటర్ మనోడే
అంచలంచెలుగా ఎదిగిన జయ్యారం బిడ్డ తిరు
పాలకుర్తి, ఏప్రిల్ 6 : ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టి పారేయడం తెలుసు’.. ఈ డైలాగ్ ఇటీవల ఎక్కడో విన్నట్టుంది కదూ.. అవును. ఇది త్వరలో విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీలోని పంచ్ డైలాగ్. ఇంతకీ ఇదెందుకు చెబుతున్నామంటే.. సినిమాకే హైలెట్గా నిలిచే ఈ డైలాగే కాదు, మూవీ మొత్తానికే డైలాగ్ రైటర్ బాధ్యతలు చేపట్టింది మన ఉమ్మడి జిల్లా బిడ్డనే. డిగ్రీ దాకా చదివి 20 ఏళ్ల క్రితం ప్రముఖ నిర్మాత, నిజామాబాద్కు చెందిన దిల్రాజు టీంలో టెక్నీషియన్గా ఉద్యోగంలో చేరిన యువకుడు సొంత టాలెంట్తో అంచలంచెలుగా ఎదిగాడు. అనేక కష్టనష్టాల కోర్చి సినీ పరిశ్రమంలో తనకంటూ ప్రత్యేక పేరును తెచ్చిపెట్టుకున్నాడు. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదూ! పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల తిరుపతి అలియాస్ తిరు.
అంచలంచెలుగా..
దిల్రాజు వద్ద సుదీర్ఘకాలం పనిచేసిన తిరుపతి, 2011లో ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాకు స్క్రిఫ్ట్ రైటర్గా పనిచేశాడు. 2013లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. నాగచైతన్య ‘జోష్’ సినిమాకు కో డైరెక్టర్గా పనిచేశాడు. అయితే, నాని ఎంసీఏ చిత్రంలో తెలంగాణ ఫేమస్ డైలాగ్ ‘సచ్చిందిరా గొర్రె’ను తిరుపతే రాశాడు. ఇక మహేశ్బాబు స్పైడర్ చిత్రం, సుమంత్, జేడీ చక్రవర్తి సిద్దార్థ్ తదితర హీరోల చిత్రాలకు పనిచేశాడు. పదేళ్లుగా వివిధ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, స్క్రిప్ట్ అసిస్టెంట్గా, డైలాగ్ రైటర్గా పనిచేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు పవన్కల్యాణ్ వకీల్సాబ్ చిత్రానికి పూర్తిస్థాయిలో డైలాగ్ రైటర్గా పనిచేశాడు.