హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): దళిత, బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న మహత్తర నిర్ణయం అమలయ్యే దిశగా తెలంగాణ సర్కార్ కీలక అడుగులు వేస్తున్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చిన ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నాయని, వీటిని సవరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వాదనలు సిద్ధం చేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే అడ్వొకేట్ ఆన్ రికార్డుకు లేఖ రాసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమించాలని కూడా ఆ లేఖలో ఆదేశించింది. ఇటీవల సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఎంత శాతం ఉండాలనే అంశంపై రాష్ర్టాల అభిప్రాయాన్ని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. రిజర్వేషన్లు జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ర్టాల అభీష్టానికి లోబడి చేసేలా ఉండాలని 2018లోనే తెలంగాణ ప్రభుత్వం అప్పటి అటార్నీ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి, అదనపు ఏజీ జే రామచందర్రావుల ద్వారా గట్టి ప్రయత్నాలు చేసింది. రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఉండేలా చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని తెలిసింది.
ఈ విధంగా చేస్తే ఇందిరా సాహ్ని కేసులోని ఉత్తర్వులు అడ్డంకి కాదనే న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా అదనపు ఏజీ ఢిల్లీలో ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న వినోద్కుమార్ రాజకీయంగా ప్రయత్నాలు చేశారు. సూత్రప్రాయంగా ప్రధాని మోదీ సీఎం కేసీఆర్కు హామీ ఇచ్చారని సమాచారం. అందుకు తగినట్లుగా కేంద్రం నుంచి చర్యలు మాత్రం లేవు. దీంతో.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ దిశగా ప్రభుత్వం మళ్లీ కసరత్తు చేస్తున్నది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ల కల్పనకు వీలున్నది. మైనార్టీలు, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు కూడా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చేసేందుకు సమాయత్తం అవుతున్నది. రాష్ర్టాల్లోని సామాజిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు ఎంత శాతం ఉండాలో నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ర్టాలకే ఉండాలని, ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తిరిగి సమీక్షించేందుకు వీలుగా విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో వాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
‘రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని రాజ్యాంగంలో ఎక్కడే పొందుపర్చలేదు. ఈశాన్య రాష్ర్టాల్లో గిరిజనుల జనాభా 50% కంటే ఎక్కువ. కాలానుగుణంగా సామాజిక పరిస్థితులు, సమీకరణాలు మారుతుంటాయి. రాజ్యాంగంలోని 102వ సవరణ ప్రకారం ఏర్పడిన 342(ఏ) అధికరణ వల్ల రాష్ర్టాలు కాలానుగుణంగా రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఓబీసీ జాబితా, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల కల్పన వంటి అవకాశాలకు ఆస్కారం లేకుండా ఆ అధికరణం అడ్డంకిగా ఉన్నది. కాబట్టి ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న ఉత్తర్వులను రద్దు చేయాలి’ అని కోరాలని నిర్ణయించినట్టు తెలిసింది.