హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో రెండు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. కర్ణాటకలోని బాపుర్- చించోలి- తెలంగాణలోని తాండూర్- కొడంగల్- మహబూబ్నగర్ మార్గాన్ని, హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్ను ఆనుకొని ఉన్న అబ్దులాపూర్మెట్ మండలంలోని గౌరెల్లి నుంచి వలిగొండ మీదుగా కొత్తగూడెం వరకు మార్గాన్ని జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు నేషనల్ హైవేలను భారత్మాల పరియోజనలో చేర్చినట్టు తెలిపింది. గౌరెల్లి- కొత్తగూడెం హైవే హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్ నుంచి మొదలై వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు మీదుగా కొత్తగూడెం వరకు ఉంటుంది. దీనివల్ల ఏజెన్సీ జిల్లాలైన మహబూబాబాద్, కొత్తగూడెం అభివృద్ధి చెందనున్నాయి. భద్రాచలం ఆలయానికి రవాణా సౌకర్యం మెరుగవనున్నది. కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్కు సంబంధించి హైవేల గుర్తింపు, విస్తరణ, ఇతర నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ.6,100 కోట్లుగా తెలిపింది.