హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ధాన్యం సేకరణపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్తో చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్కు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం శుక్రవారం సమావేశమైన విషయం తెలిసిందే.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరుగనున్నది. పార్టీ రాజ్యసభ, లోక్సభ సభ్యులకు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు తదితర అంశాలపై పార్టీ వైఖరిని పార్లమెంట్లో లేవనెత్తాల్సిన తీరుపై సీఎం పలు సూచనలు చేయనున్నారు.