హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ‘తీన్మార్ మల్లన్న ఓ సైకో. క్యూ న్యూస్ చానల్ పేరిట అనేక అక్రమ దందాలకు పాల్పడుతున్న బడాచోర్. ఒకవైపు అంబేద్కర్, కాన్షీరాం సిద్ధాంతాలను వల్లె వేస్తూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను మోసం చేస్తున్నడు. మరోవైపు రాజకీయ ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఆఖరికి సామాజిక సేవ పేరిట కూడా సొమ్ము కూడబెడుతున్నడు’ అని క్యూ న్యూస్ చానల్ బ్యూరో చీఫ్, సోషల్ మీడియా కన్వీనర్ చిలుక ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదేమని నిలదీస్తే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడులు జరిగినా వెనకడుగు వేసేది లేదని, మల్లన్న చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నపై విరుచుకుపడ్డారు. బహుజనవాదం, అంబ్కేదర్, కాన్షీరాం సిద్ధాంతాలను చెప్తూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను వంచిస్తున్నాడని ప్రవీణ్ మండిపడ్డారు. బంధువులు, మున్నూరుకాపులకే మల్లన్న ప్రాధాన్యతనిస్తాడని, అందుకు క్యూ న్యూస్ చానలే నిదర్శనమని ఉదహరించారు. చానల్లో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఎడిటర్ వరకూ ఉన్న 16 మందిలో 12 మంది వాళ్లేనని వెల్లడించారు. సాయం కోసం ఆశ్రయించిన మహిళలను సైతం అసభ్యకర పదజాలంతో కించపరుస్తాడని, మల్లన్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిందని వివరించారు. మల్లన్న సమాజానికి పట్టిన చీడపురుగని, పార్టీ పెడతానని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని తనను నమ్మించాడని ప్రవీణ్ తెలిపారు. మల్లన్న అక్రమాలను చూడలేకే చానల్ నుంచి బయటకొచ్చానని, ఇంకెవరూ మోసపోవద్దనే ఈ విషయాలను బయటపెడుతున్నానని పేర్కొన్నారు.
క్యూన్యూస్ చానల్లో ఉదయం ఒక దందాను, సాయంత్రం ఒక దందాను నిర్వహిస్తూ, మల్లన్న చేస్తున్న అక్రమాలకు అంతే లేదని ప్రవీణ్ ఆరోపించారు. అనేకమంది రాజకీయ ప్రముఖుల నుంచి వసూళ్లకు తెరలేపాడని వివరించారు. రూ.200కోట్లకు పైగా ఆస్తులను మూటగట్టుకున్నాడని వెల్లడించారు. బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఈటల రాజేందర్తో సహా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర 15 రోజుల క్రితం డబ్బులు తెచ్చుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను సైతం బోల్తా కొట్టించాలని యత్నించాడని తెలిపారు. పక్క రాష్ర్టానికి చెందిన ఓ మాజీమంత్రితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు.
సొసైటీ పేరిట సామాజిక సేవా సంస్థను ఏర్పాటుచేసి అనేక అక్రమాలకు తీన్మార్ మల్లన్న తెగబడుతున్నాడని ప్రవీణ్ వెల్లడించారు. రూ.50 కోట్లు కొల్లగొట్టేందుకు భారీవ్యూహాన్ని రచించాడని మండిపడ్డారు. తనను కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నాడని ప్రవీణ్ వాపోయారు. అవినీతికి పాల్పడుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఉద్యోగి దాసరి భూమయ్యను ఎందుకు వెనకేస్తున్నావో చెప్పాలని మల్లన్నను ప్రవీణ్ డిమాండ్చేశారు. సమావేశంలో అశోక్, మంద కిషన్ తదితరులు పాల్గొన్నారు.
చానల్ను అడ్డుపెట్టుకుని తీన్మార్ మల్లన్న అమాయకుల జీవితాలతో ఆడుకున్నట్టు ప్రవీణ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఉన్న వివరాలు ఇలా..
హైదరాబాద్లోని సీతాఫల్మండికి చెందిన మంజుల అనే మహిళకు రూ.2 కోట్ల విలువ చేసే ఇల్లు కబ్జాకు గురైంది. ఆమె కోర్టును ఆశ్రయించగా 23 ఏండ్లుగా కేసు విచారణ కొనసాగుతున్నది. కబ్జా చేసినవాళ్లు ఆ వ్యవహారాన్ని సెటిల్ చేయాలని తీన్మార్ మల్లన్నను ఆశ్రయించారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని రంగంలోకి దిగిన మల్లన్న నేరుగా మంజులకు ఫోన్ చేసి సెటిల్ చేస్తానని నమ్మబలికి తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లాక కబ్జాదారుల తరపున వకాల్తా పుచ్చుకుని బాధిత మహిళను బెదిరించాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవటంతో కబ్జాదారుల నుంచి రూ.20లక్షల ఇప్పిస్తానని నమ్మించి మంజులతో కాగితాలు, ఆస్తిని వారి పేరిట రాయించాడు. ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు అని బాధిత మహిళ చెప్పినట్టు వీడియోలో ఉన్నది.
మల్లన్న డబ్బు దందా మరో పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసినట్టు సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ది. అందులో వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన దంపతులు మనస్పర్థలు వచ్చి కొద్దికాలంగా దూరంగా ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఎప్పటికైనా భార్య తిరిగి వస్తుందని భర్త ఆశతో ఎదురుచూస్తున్నాడు. భార్య మాత్రం విడిగా జీవించాలని నిశ్చయించుకుంది. ఇదే విషయమై పెద్దమనుషుల పంచాయితీలు కొనసాగుతుండగా మల్లన్న ప్రవేశించాడు. తన భార్యను రెచ్చగొట్టి విడాకులు తీసుకునేలా మల్లన్న ప్రోత్సహించాడని ఇప్పుడా భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేసులు, పోలీసులు అంటూ బెదిరించి రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, కాగితం రాయించుకున్నాడని బాధితుడు వాపోతున్నాడు.