హైదరాబాద్, నల్లగొండ, మార్చి18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుబాటలో పయనిస్తున్నారు. ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. తొలిప్రాధాన్య ఓట్లతోనే ఎవరికీ గెలిచే అవకాశం కనిపించడంలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయానికి పల్లా రాజేశ్వర్రెడ్డి 30%, ఎస్ వాణీదేవి 31.5% ఓట్లు సాధించారు. మరికొన్ని రౌండ్లు మిగిలి ఉన్నప్పటికీ తొలి ప్రాధాన్య ఓట్లలో 50%+1 ఓట్లు రాబట్టడం కష్టమే. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారనున్నది. తుది ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడే అవకాశం ఉన్నది.
నల్లగొండ-ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 3,88,011 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్కు సగటున 56 వేల ఓట్ల చొప్పున ఏడు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆరు రౌండ్లకు 3,36,000 ఓట్లు పోలవ్వగా, 18,573 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. మిగిలిన 3,17,427 ఓట్లను లెక్కించగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు అత్యధికంగా 95,311 ఓట్లు (సగటున 30 శాతం) పడ్డాయి. రెండోస్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నకు 22.8 శాతం, మూడో స్థానంలో ఉన్న కోదండరాంకు 18.83 శాతం ఓట్లు పోలయ్యాయి. చెల్లిన ఓట్లలో 50 శాతం+1 ఓటు వస్తేనే అభ్యర్థి గెలిచినట్టు. మరో రౌండు మాత్రమే మిగిలి ఉన్నది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అభ్యర్థులెవరూ 50 శాతం ఓట్లు పొందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు సన్నద్ధమవుతున్నారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యతను కనబరుస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఆరు రౌండ్ల ఫలితాలు వెలువడగా.. పల్లా రాజేశ్వర్రెడ్డి అత్యధికంగా 95,311 ఓట్లను సాధించారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 72,464 ఓట్లతో రెండో స్థానంలో, తెలంగాణ జన సమితి తరఫున పోటీ చేసిన ఫ్రొఫెసర్ కోదండరాం 59,784 ఓట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నారు. మరో రౌండ్ ఫలితాలు రావాల్సి ఉన్నది. తొలి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి కానున్నది.
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి సమయానికి ఆరు రౌండ్లు పూర్తి కాగా అన్ని రౌండ్లలోనూ పల్లాకే మెజార్టీ లభించింది. ఒక్కో రౌండ్లో సగటున 3,700 నుంచి 4,100 ఓట్లు ఆధిక్యత కనబరుస్తున్నారు. రౌండ్ల వారీగా పరిశీలిస్తే తొలి రౌండ్లో 16,130 ఓట్లు రాగా 4,084 ఓట్ల ఆధిక్యం, రెండో రౌండ్లో 15,857 ఓట్లు(ఆధిక్యం 3,787) మూడో రౌండ్లో 15,558 ఓట్లు (ఆధిక్యం 3,816), నాలుగో రౌండ్లో 15,897 ఓట్లు (3,751 ఆధిక్యం), ఐదో రౌండ్లో15,671 ఓట్లు (ఆధిక్యం 3,111), ఆరో రౌండ్లో 16,198 ఓట్లు రాగా మొత్తం 4,298 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం కొనసాగుతున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు సగటున 30 శాతం ఓట్లు పోలయ్యాయి. తీన్మార్ మల్లన్నకు 22.8 శాతం, కోదండరామ్కు 18.8 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారింది. పల్లా గెలువాలంటే ఇంకో 20 శాతం, మల్లన్నకు 27.2 శాతం, కోదండరాంకు 31.2 శాతం ద్వితీయ ప్రాధాన్య ఓట్లు రావాల్సి ఉన్నది.
ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకుంటే తృతీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటివరకు ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే తృతీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కూడా తప్పకపోవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. రౌండ్లవారీగా చెల్లిన ఓట్ల సగటు చూస్తే మొత్తం 3.66 లక్షల ఓట్లు చెల్లుబాటయ్యేలా ఉన్నాయి. ఈ మేరకు గెలువాలంటే 1.83 లక్షల ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న సగటున లెక్కేస్తే పల్లాకు కూడా తొలి ప్రాధాన్య ఓట్లల్లో సుమారు 1.10 లక్షలు రానున్నాయి. అంటే పల్లా గెలువాలంటే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లల్లో మరో 73 వేలు సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తృతీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు సిద్ధంకాక తప్పదని టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతి రౌండ్లో సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై దాదాపు 2 వేల మెజార్టీ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి 70,552 ఓట్లు సాధించిన వాణీదేవి.. 5,553 ఓట్ల మెజార్టీతో ముందున్నారు. 5.31 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 3,57,354 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రతి రౌండ్లో దాదాపు 56 వేల ఓట్లను లెక్కిస్తుండగా.. సరాసరిన 3,300 ఓట్లు చెల్లని ఓట్ల ఖాతాలో పడుతున్నాయి. వాణీదేవి ప్రతి రౌండ్లో సరాసరిన 17 వేల పైచిలుకు ఓట్లతో 70,552 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలోని బీజేపీ అభ్యర్థి సరాసరిన 16 వేల పైచిలుకు ఓట్లతో నాలుగు రౌండ్లలో కలిపి 64,999 ఓట్లను సాధించారు. మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ 34,029 ఓట్లతో ఉన్నారు.
గురువారం రాత్రి వరకు వచ్చిన ఫలితాల్లో రౌండ్లలో 13,364 ఓట్లు చెల్లని ఓట్ల జాబితాలో పడ్డాయి. ఇదే సగటుతో 3,57,354 ఓట్లను బేరీజు వేస్తే.. 20-25 వేల మధ్య చెల్లని ఓట్లు ఉండే అవకాశముంటుందని అంచనా. ఈ నేపథ్యంలో 1.60 లక్షల నుంచి 1.90 లక్షల మధ్య ఓట్లు వచ్చిన అభ్యర్థే గెలిచినట్టు విశ్లేషిస్తున్నారు. నాలుగో రౌండ్ వరకు సగటున 2,24,032 ఓట్లు చెల్లినట్టు గుర్తించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 70,552 ఓట్లు(31.5 శాతం) ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు 64,999(29 శాతం) ఓట్లను సాధించారు. మూడో స్థానంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ 34,029(15 శాతం) ఓట్లను సాధించారు. దీంతో కోటా ఓట్లను సాధించాలంటే వాణీదేవికి ఇంకా 18.5 శాతం, రాంచందర్రావు 21 శాతం, నాగేశ్వర్ 35 శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలే అవకాశాలు లేవనేది స్పష్టమవుతున్నది.