హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కల్తీరహిత విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే నకిలీల కట్టడికి ప్రభు త్వం చర్యలు చేపడుతున్నదని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాల కట్టడిపై శనివారం మంత్రి అధికారులతో సమీక్షించారు. టాస్క్ఫోర్స్ దాడులతో నకిలీ విత్తనాలు సరఫరా చేసే కేటుగాళ్ల వెన్నులో వణుకుపుట్టిందన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 177 కేసులు నమోదు చేయటంతోపాటు 276 మందిని అరెస్టుచేసినట్టు వెల్లడించారు. పీడీ యాక్ట్ కింద 32 కేసులు నమోదు చేసినట్టు వివరించారు. పత్తి, మిరప విత్తనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. విత్తన చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు.