హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరుకు మంత్రులంతా కదనరంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, జిల్లాకేంద్రాల్లోని దవాఖానల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరుసగా సమీక్షిస్తూ ప్రభుత్వయంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటూనే.. మంత్రులంతా జిల్లాల్లోనే ఉంటూ క్షేత్రస్థాయిలో కరోనా నియంత్రణ చర్యలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల్లోనే మకాంవేసిన మంత్రులు లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తూనే కరోనా వైద్యసేవలపై దృష్టి సారించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్న బృందాల పనితీరును పరిశీలిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశమై కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించింది. ఆక్సిజన్ సరఫరా, మందుల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించింది. జ్వరసర్వేపై ఆరా తీసింది. మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో కరోనా నియంత్రణ చర్యలపై ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో లాక్డౌన్ అమలు తీరుపై ఆయా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో రెండ్రోజులు కరోనా నియంత్రణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. సూర్యాపేటలో త్వరలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్ నిర్మించనున్నట్టు తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలం ఐటీసీ యజమాన్యంతో మాట్లాడి ఖమ్మం జిల్లాకు సరిపోయేలా ప్రతిరోజూ ఐదు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాకు అంగీకరించేలా కృషిచేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఏటూరు నాగారం గిరిజన భవన్లో ఏర్పాటుచేసిన కొవిడ్ ప్రత్యేక వార్డును పరిశీలించారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి కరోనా నియంత్రణ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లలో ప్రభుత్వ దవాఖానలను పరిశీలించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ జిల్లా అధికారులతో మాట్లాడి వైద్యానికి మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.