పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతున్నది. నూటికి నూరుశాతం రాతి కట్టడాలు, కృష్ణ శిలలతో నిర్మితమవుతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నది. పునః ప్రారంభానంతరం లక్ష్మీనారసింహుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలి
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మార్చి12( నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రాన్ని త్వరలో పునః ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతిభవన్లో శుక్రవారం సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుదిరూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృతరూపం (ఆర్నమెంటల్ లుక్) కోసం కార్యాచరణ గురించి చర్చించారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించి క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరిసర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు చేసిన నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సీఎం కేసీఆర్.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుట్టపై శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సీఎం, ఆలయ ప్రహరీ గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలని ఆదేశించారు. ఉత్తరదిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగిచూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్లాగా) కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనచక్రం ఏర్పాటు చేసినట్టుగానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలని ఆదేశించారు. రథశాలను ఆలయ ఎలివేషన్తో తీర్చిదిద్దాలని తెలిపారు. విష్ణు పుష్కరిణి కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్తు దీపాలను అలంకరించాలన్నారు. 80 ఫీట్ల పొడవున్న దీప స్తంభాన్ని లాన్ నడుమ ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమవుతున్నదని సీఎం కితాబిచ్చారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం కేసీఆర్ తిలకించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సలహాదారు అనురాగ్శర్మ, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
దర్శనానికి వచ్చే భక్తులకోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైన్ పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం ముందుంచారు. వీటిని పరిశీలించి.. నాలుగింటిలో ఒకదాన్ని సీఎం ఖరారుచేశారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీని తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్15 కల్లా క్యూలైన్ నిర్మా ణం పూర్తికావాలని సీఎం గడువు విధించారు. దీప స్తంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పాదచారుల బాటలో కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని చెప్పారు.