హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వక్ఫ్బోర్డు ఆస్తుల ఆక్రమణదారులకు నోటీసులు జారీచేయడం సరైనదేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఆక్రమణకు గురైన భూమిని ఏమేరకు స్వాధీ నం చేసుకున్నారో చెప్పాలని రాష్ట్ర వక్ఫ్బోర్డును ఆదేశించింది. వక్ఫ్బోర్డు భూముల రక్షణకు ప్రణాళికతోపాటు కార్యాచరణతో ముందుకుసాగాలని సూచించింది. భూముల రక్షణకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేయాలన్న గత ఉత్తర్వులను ఏమేరకు అమలుచేశారో అఫిడివిట్ దాఖలుచేయాలని ఆదేశించింది. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తే.. మూణ్నెల్లుగా తీసుకున్న చర్యలను తెలియజేయాలని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీ విజయసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం కోరింది. ముస్లింల శ్మశానవాటికలు ఆక్రమణలకు గురికావడంపై దాఖలైన పిల్పై విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. తదుపరి విచారణకు వక్ఫ్బోర్డు సీఈవో రికార్డులతో స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. 2020 డిసెంబర్ నుంచి ఈ నెల చివరివరకు వక్ఫ్బోర్డు ఆస్తుల అన్యాక్రాంతంపై తీసుకున్న చర్యలను నివేదించాలని ఆదేశించింది. హౌస్ కమిటీ నివేదికలోని ఆస్తి వక్ఫ్ బోర్డుది కాదని బోర్డు తరఫు న్యాయవాది అబూ అక్రమ్ చెప్పారు. ఇందులో ప్రైవేట్ ప్రతివాదిగా ఉన్న సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ తరఫు న్యాయవాది వాది స్తూ.. ఆ స్థలం తనది కాదని, తన భార్య పేరిట ఉ న్నదని, అక్కడే ఉంటున్నామని చెప్పడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది.