హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కేంద్రం నుంచి తెలంగాణకు అది తెచ్చాం.. ఇది తెచ్చాం.. నిధులన్నీ నెత్తిన పెట్టుకొచ్చాం.. అంటూ ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర బీజేపీ నేతల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమాధానాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుకొని ఒక్కొక్కరి దిమ్మ తిరుగుతున్నది. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వంతు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గత మూడేండ్లలో దేశవ్యాప్తంగా 90 మెడికల్ కాలేజీలను స్థాపించిందని, ఇందులో తెలంగాణలో 9 కాలేజీలను ఏర్పాటుచేసిందని కిషన్రెడ్డి శనివారం ట్వీట్ చేశారు. ఇదంతా ఫేక్ ప్రచారమని తాజాగా తేలింది. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ జీఎం సిద్ధేశ్వర.. మెడికల్ కాలేజీలపై వివరాలు ఇవ్వాలని ఇటీవల లోక్సభలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరారు. దీనికి కేంద్రం గత నెల 30న లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ‘90 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చింది.
ఇందులో తెలంగాణకు చెందిన 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో నాలుగు ప్రభుత్వ కాలేజీలు కాగా, ఐదు ప్రైవేట్ కాలేజీలు. బీబీనగర్ ఎయిమ్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి చెందినది’ అని పేర్కొన్నది. అనుమతులు మాత్రమే ఇచ్చి కేంద్రమే ఏర్పాటు చేస్తున్నది అన్నట్టు కిషన్రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలను కూడా నిర్మిస్తున్నదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్రం దేశవ్యాప్తంగా 157 కాలేజీలను ఎంపిక చేయగా ఇందులో ఒక్కటీ తెలంగాణకు మంజూరు కాలేదు. బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉండి కూడా ఒక్క కాలేజీని కూడా మంజూరు చేసుకోలేకపోవడం సిగ్గుచేటు అని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇజ్జత్ తీస్తున్న కిషన్రెడ్డి అంటూ..
టీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దుష్ప్రచారాన్ని ట్విట్టర్వేదికగా ఎండగట్టారు.
‘కేటీఆర్: అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ ఖ్యాతిని చెప్తూ పెట్టుబడులు తెస్తున్న బ్రాండ్ అంబాసిడర్
కిషన్రెడ్డి: కేంద్ర పర్యాటక మంత్రిగా తెలంగాణ ఇజ్జత్ తీస్తూ, తెలంగాణకు ఏమీ రాకున్నా బాగా ప్రచారం చేస్తున్న బ్రాండ్ అంబాసిడర్’ అని ఎద్దేవా చేశారు.