హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులపై భారంమోపకుండా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును రెండు వారాలపాటు పొడిగించాలని నిశ్చయించింది. ఈ మేరకు సెట్ కన్వీనర్లకు స్వేచ్ఛను ఇస్తూ ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. రెండు వారాల తర్వాత అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరించాలని సూచించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) దరఖాస్తుల స్వీకరణను ఇప్పటివరకు రెండుసార్లు పొడిగించారు. మిగతా సెట్లకు సైతం ఇదే తరహా విధానాన్ని అమలుచేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఎం సెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, పీఈసెట్, లా సెట్, పీజీఎల్సెట్, ఎడ్సెట్ ప్రవేశ పరీక్షల అపరాధ రుసుము 50 శాతం తగ్గించారు. గతంలో రూ. 500, వెయ్యి, రూ.2 వేలుగా ఉన్న అపరాధ రుసుములను రూ.250, రూ.500, రూ.వెయ్యికి తగ్గించారు. ఎంసెట్ సహా మరికొన్ని ప్రవేశ పరీక్షలకు తత్కాల్ స్కీం కింద రూ.10 వేలుగా ఉన్న అపరాధ రుసుమును రూ.5 వేలకు తగ్గించారు.
బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఇప్పటికే ఒక దఫా పొడిగించగా తాజాగా ఈ నెల 22వ తేదీవరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డేపల్లి సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసు ము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగియగా, కరోనా నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగించామని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు.