హైదరాబాద్: యాదాద్రి ఆలయ సౌందర్యం అందర్నీ మైమరిపిస్తున్నది. నారసింహుడి నేల నయన మనోహరంగా దర్శనమిస్తున్నది. యాదాద్రిలో జరుగుతున్న ఆలయ జీర్ణోద్దరణ అద్భుత కళాఖండంగా అవతరిస్తోంది. ఆలయ శిల్పకళ మహాద్భుతంగా ఉన్నట్లు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. భక్తి పారవశ్యం ఉప్పొంగేలా.. ఆగమశాస్త్రం ఉట్టిపడేలా.. యాదాద్రి నిర్మితమవుతున్న తీరు ఎంపీ సంతోష్ కుమార్ను ఎంతో పరవశింపచేసింది. రాత్రి వేళ సువర్ణశోభలో వెలిగిపోతున్న ఆ అపూర్వ నిర్మాణ అందాలను ఎంపీ సంతోష్ తన కెమెరాలో బంధించారు.
సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి యాదాద్రికి వెళ్లిన ఎంపీ సంతోష్ అక్కడ తీసిన ఫోటోలను తన ట్వీట్టర్లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. యాదాద్రీశుడి చుట్టూ ఉన్న వాతావరణం.. పచ్చని చెట్లు.. ఆలయ అందాన్ని మరింత ఇనుమడింప చేస్తున్నాయని.. సీఎం కేసీఆర్ విజన్, పట్టుదల అమోఘమన్నారు. ప్రాచీన, ఆధునిక పద్ధతుల్లో నిర్మితమవుతున్న యాదగిరి క్షేత్రం మునుముందు ప్రపంచం నలుదిశల నుంచి భక్తవత్సలుడి భక్తుల్ని రప్పిస్తుందని తన ట్వీట్లో ఎంపీ పేర్కొన్నారు. బంగారు, పసుపు వర్ణంలో మిరుమిట్లుగొలుపుతున్న యాదాద్రి ఆలయ ఫోటోలను కొన్నింటిని ఆయన ట్వీట్ చేశారు. వినీల ఆకాశం నుంచి చంద్రుడు యాదాద్రి ఆలయ గోపురాన్ని తిలకిస్తున్నట్లుగా ఎంపీ తీసిన ఫోటో అద్భుతంగా ఉంది. ఆ ఫోటోలను మీరూ వీక్షించండి..