న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో రాష్ట్రాలకు అధికారం దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓబీసీలను ఐడెంటిఫై చేసే వీలవుతుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఓబీసీల కోసం ఎన్నో పథకాలు చేపట్టారన్నారు. రైతుల కోసం రైతు బంధు తీసుకువచ్చామని, ప్రతి ఏడాది ఒక ఎకరాకు పది వేలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని ఎంపీ నామా తెలిపారు.
అయితే తాజాగా తెలంగాణ సర్కార్ దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎంపీ నామా చెప్పారు. ప్రతి ఒక్కరూ సభలో.. ఓబీసీలు, దళితు ల కోసం మాట్లాడుతున్నారని, ఆ స్కీమ్ ప్రకారం దళిత ఫ్యామిలీలకు పది లక్షలు ఇస్తున్నామని తెలిపారు. దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఎంపీ నామా కేంద్రాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆ పథకం స్టార్ట్ అయ్యిందన్నారు. ఓబీసీ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ నామా చెప్పారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి వీరేంద్రను నామా మెచ్చుకున్నారు. ఆయన వల్లే ఇవాళ సభ సాగుతోందన్నారు.