హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మానవీయ కోణంలో చేసిన సేవలకు డయానా అవార్డు అందుకున్న తన తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్ రావుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ గుర్తింపును అందుకున్నందుకు తండ్రిగా గర్వ పడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రౌడ్ ఫాదర్ అనే హ్యాష్ట్యాగ్ జత చేశారు.
సమాజంలో మార్పు కోసం హిమాన్ష్ రావు 15 ఏండ్ల వయస్సులోనే శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో స్వయం సమృద్ధి సాధన కోసం చేపట్టాల్సిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వయంగా శోమ (Shoma) అనే ప్రాజెక్ట్ ప్రారంభించారు.
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల్లో ఆయన పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టుకి సహకరించిన 2 గ్రామాల ప్రజలకు, తన గురువులకు హిమాన్షు రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం తనకు సంపూర్ణ మార్గదర్శనం చేసినందుకు తన తాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు.
9-25 ఏండ్ల మధ్య వయస్సు గల వారికి ఇచ్చే ఈ అవార్డు ఈ ఏడాది హిమాన్ష్ రావుకు దక్కింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేపట్టే పనులకు ఈ అవార్డు బహుకరిస్తారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద ఈ అవార్డు ఏర్పాటైంది. బ్రిటన్ కేంద్రంగా ఈ అవార్డును ప్రధానం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా యువకులు చేసే సోషల్ వర్క్ ని ఈ అవార్డు కోసం పరిగణలోకి తీసుకుంటుంది.
డయానా అవార్డుకు ఎంపికైన హిమన్షుకు, ఆయన మిత్రులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కేవలం 15 ఏండ్ల వయసులోనే మానవీయ దృక్పథంతో గ్రామాల్లో మార్పుకు చేపట్టిన కార్యక్రమాలతో అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం గొప్ప విషయమని ప్రశంసించారు.