హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఎలాంటి ఢోకా లేదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వల కొరత తలెత్తినప్పటికీ, తెలంగాణకు అలాంటి సమస్య లేదని చెప్పారు. సింగరేణిలో రోజుకు లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా, మనం 30 వేల టన్నులకు మించి వాడటం లేదని వివరించారు. విదేశీ బొగ్గు నిల్వలు, విద్యుత్తు కంపెనీలకు బొగ్గు సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కొన్ని రాష్ర్టాలకు ఇబ్బంది ఉంటుందేమో కానీ తెలంగాణకు ఢోకా లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్ల విద్యుత్తు రంగంలో అనేక సంక్షోభాలను అధిగమించామని, బొగ్గు నిల్వల కొరత లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే నిలిచిందని చెప్పారు. గత ఏడేండ్లలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఏనాడూ విదేశీ బొగ్గును కొనుగోలు చేయలేదని తెలిపారు. టీఎస్ జెన్కో కేంద్రాలకు విదేశీ బొగ్గు అవసరం లేదని వెల్లడించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలన్నీ పిట్హెడ్ ప్లాంట్లని, బొగ్గు ఉత్పత్తయ్యే ప్రాంతాల్లోనే విద్యుత్ కేంద్రాలున్నాయని, రవాణా సమస్యే తలెత్తదని వివరించారు. రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) జాతీయ సగటుకన్నా ఎక్కువగానే నమోదవుతున్నదని చెప్పారు. రాష్ట్రంలోని హైడల్ ప్రాజెక్టుల ద్వారా కూడా నిరంతరం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. కొన్ని పత్రికలు రాస్తున్న అభూతకల్పనలను నమ్మొద్దని చెప్పారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు అవసరమైన బొగ్గు నిల్వలున్నాయని, హైడల్ ఉత్పత్తి కూడా సమాంతరంగా జరుగుతున్నదని చెప్పారు. భవిష్యత్తులో కూడా నిరాటంకంగా విద్యుత్తును సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు.