ఎస్సీ, ఎస్టీ వర్గాల మాదిరిగానే మైనారిటీల్లో కూడా పేదరికం ఉంది. ముస్లింలు, ఇతర మైనార్టీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానం అమలు చేస్తున్నది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే విషయంలో ఎస్సీ, ఎస్టీల పట్ల ఎంత ఉదారంగా ఉంటుందో, మైనారిటీల విషయంలో కూడా అలాగే ఉండాలని నిర్ణయించింది.
మైనారిటీల సంక్షేమానికి, విద్య, ఉపాధి కోసం కావాల్సినంత డబ్బులు ఖర్చు పెడుతున్నది. 2014-15 బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి మైనారిటీ సంక్షేమానికి రూ.1,030 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో 2015-16 బడ్జెట్లో రూ. 1,130 కోట్లు, 2016-17 సంవత్సరంలో రూ.1,204 కోట్లు, 2017-18 లో 1249.66 కోట్లు, 2018-19 లో రూ.2 వేల కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.2,004 కోట్లు, 2020-21లో రూ.1518.06 కోట్లు కేటాయించారు.
తెలంగాణ ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రతీ సంవత్సరం రాష్ట్రంలోని నిరుపేద మైనారిటీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తుల పంపిణీ చేపడుతున్నది. ఇందులో భాగంగా 2 లక్షల మంది క్రిస్టియన్లకు, 4 లక్షల మంది ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందులను, క్రిస్మస్ విందులను ఏర్పాటు చేసి లౌకిక స్ఫూర్తిని చాటుకుంటున్నది. రాష్ట్రంలోని 2 లక్షల 40 వేల క్రిస్టియన్ కుటుంబాలకు 2019 డిసెంబర్ లో గిఫ్ట్ ప్యాక్ లు ఇచ్చారు. గిఫ్ట్ ప్యాక్ లో ప్యాంట్, షర్ట్, చీరె, అమ్మాయిలకు పంజాబీ సూట్ టెస్కో ద్వారా అందించారు.
పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని ముస్లిం మహిళల పెళ్లల్లు చేయాలంటె వారి తల్లిదండ్రులకు తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడేవారు అలాంటి వారికి ప్రభుత్వం తరుపున రూ.లక్షా 116 రూపాయల సాయాన్ని షాదీముబారక్ పథకం ద్వారా అందజేస్తున్నారు.
ఒంటరి ముస్లిం మహిళలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు మెయింటెనెన్సు అలవెన్సు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 361 మందిని గుర్తించింది.
భారత దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజైన నవంబర్ 11ను మైనారిటి సంక్షేమ దినంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి టిఎస్ ప్రైడ్ పథకం ప్రవేశపెట్టినట్లే, మైనారిటీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి టిఎస్ ప్రైమ్ పథకం ప్రవేశపెట్టారు. మైనారిటీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే రాయితీలిస్తూ, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు.
ముస్లిం అనాథలకు ఆశ్రయమిస్తున్న సంస్థ అనీస్ ఉల్ గుర్బాకు నాంపల్లిలో 4300 చదరపు గజాల అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో బహుళ అంతస్తులతో భవనం నిర్మిస్తున్నారు.
మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం అందించే రుణాల సబ్సిడీని ప్రభుత్వం 50 శాతం నుంచి 80 శాతానికి పెంచింది. పథకం గరిష్ట విలువను రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచారు. యూనిట్ల స్థాపనకు రెండు, మూడు లక్షలు ఖర్చయితే ఆ డబ్బులను బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం వందకు వందశాతం సబ్సిడీతో నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నది.
నాక్, ఈసిఐఎల్, సిఐపిఇటి, సెట్విన్ లాంటి సంస్థల ద్వారా మైనారిటీ యువత నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల మైనారిటీ యువకులు వివిధ నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో రాణించడానికి అవకాశం కలుగుతున్నది.
క్రైస్తవులు సామాజిక వికాసానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం కోకాపేటలో రెండెకరాలలో రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవన్ నిర్మిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలుండేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలును కల్పించింది.
మైనార్టీల అభివృద్ధిలో భాగంగానే ప్రభుత్వం క్రైస్తవుల కోసం హైదరాబాద్ పరిసర జిల్లాల్లో 40 ఎకరాలను స్మృతివనాల నిర్మాణం కోసం కేటాయించింది.
రాజస్థాన్ లోని ముస్లింల ప్రార్థనా మందిరమైన అజ్మీర్ దర్గా వద్ద రుబాత్ నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. దీని కోసం రూ.5 కోట్లు కేటాయించింది. రాజస్థాన్ ప్రభుత్వం కూడా రుబాత్ నిర్మాణానికి స్థలం కేటాయించింది.
మక్కా మసీదు పరిరక్షణ, మరమ్మతులు, ఆధునీకరణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.8.48 కోట్లు మంజూరు చేసింది. పనులు జరుగుతున్నాయి.
పహాడీ షరీఫ్ వద్ద ముస్లింల శ్మశానవాటిక కోసం 10 ఎకరాల స్థలం
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పహాడీ షరీఫ్ వద్ద ముస్లింల శ్మశానవాటిక కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
హైదరాబాద్ జామియా నిజామియా యూనివర్సిటీలో రూ.14.65 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
ఫలక్ నుమాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. రూ. 10 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 71 మైనారిటీ జూనియర్ డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని 17 మైనారిటీ జూనియర్ కాలేజీలు, 4 మైనారిటీ డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉర్దూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న కాలేజీల్లో అధ్యాపకుల నియామకం చేపట్టింది.
హజ్ యాత్రికులకు ప్రయాణ ఏర్పాట్లు, యోగక్షేమాలను చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. మహ్మద్ మసీఉల్లా ఖాన్ ఈ కమిటికి చైర్మన్ గా, ఈఓగా షఫీఉల్లాఖాన్ వ్యవహరిస్తున్నారు. మక్కా, మదీనాలకు ముస్లింల హజ్ యాత్రను నిర్వహించడంలో రాష్ట్ర హజ్ కమిటీకి రూ.3 కోట్ల గ్రాంటును ఇచ్చింది. భారత హజ్ కమిటీతో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సమన్వయం కలిగి వుండి దరఖాస్తులు తీసుకోవడం, పరిష్కరించడం, టికెటింగ్, బోర్డింగు, లాడ్జింగ్, రవాణా అవసరాలకు ఏర్పాట్లు చేస్తున్నది. 2020లో హజ్ యాత్రకు వెళ్లేందుకు 10,752 మంది దరఖాస్తు చేసుకోగా, కమిటీ 4,341 మందిని ఎంపిక చేశారు.
విద్య, ఉపాధి, శిక్షణ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా 52 షాదీఖానా కమ్ ఉర్దూ ఘర్ లను ప్రభుత్వం నిర్మించింది. గతంలో నిర్మించిన షాదీఖానాలకు మరమ్మతులు చేశారు.
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, నార్సింగి గ్రామంలో సిక్కు గురుద్వారా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లకు పైగా విలువైన 3 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గురునానక్ 548వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో 4 నవంబర్, 2017న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గురుద్వారా స్థలం పత్రాలను సిక్కు మతగురువులకు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 206 గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇంత పెద్ద ఎత్తున మైనారిటీల కోసం దేశంలో మరెక్కడా గురుకులాలు నిర్వహించడం లేదు.
నిరుపేద మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్ లతో ఆర్థిక సాయం అందజేస్తున్నది. ఈ పథకం కింద ఒక్కో మైనారిటీ విద్యార్థికి రూ.20 లక్షలకు పైగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నది. మే 2021 నాటికి 1,684 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.290 కోట్లు ప్రభుత్వం సాయం అందించింది.
మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.5 వేల భృతి అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తొలుత వీరికి నెలకు రూ. వెయ్యి చొప్పున భృతి అందించేది. 1 ఏప్రిల్ 2017 నుంచి ఈ భృతిని 1,500 రూపాయలకు పెంచింది. 2018 సెప్టెంబరు 1 నుండి రూ.5 వేలకు పెంచింది. దీంతో రాష్ట్రంలోని 10 వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. మే 2021 నాటికి ఇమామ్, మౌజమ్ లకు ప్రభుత్వం రూ.159,30,79,500 కోట్లు భృతి అందజేసింది.
మైనార్టీ వర్గాల సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి సిఫారసులు చేసేందుకు 3 మార్చి, 2015న ప్రభుత్వం మైనారిటీ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ జి.సుధీర్ చైర్మన్ గా, ఎంఎ బరీ, ప్రొఫెసర్ అబ్దుల్ షబాన్, అమీరుల్లా ఖాన్ సభ్యులుగా వ్యవహరించారు. దశాబ్దాలుగా అణిచివేతకు గురై, అభివృద్ధికి నోచుకోని వర్గాలను సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేలా ఈ కమిషన్ సిఫారసులు ఉన్నాయి. ఈ కమిషన్ మైనారిటీ సామాజిక వర్గాల జీవన స్థితిగతులపై అధ్యయనం జరిపి, రిజర్వేషన్లను కల్పించే అంశంతోపాటు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను వారికి అందించే విషయంలో సిఫారసులు చేసింది. ముస్లిం రిజర్వేషన్లను 9-12 శాతానికి పెంచాలని సిఫార్సులు చేసింది. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
మైనార్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 3 జనవరి, 2018న ఉత్తర్వులు జారీచేసింది. కమిషన్ చైర్మన్గా మహ్మద్ కమరుద్దీన్, సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, డాక్టర్ విద్యా స్రవంతి, గుస్తినోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్లను నియమించింది. ఈ కమిషన్ మూడేండ్ల పాటు కొనసాగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ జీవన పరిస్థితులు మెరుగు పర్చడానికి అన్నిరకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మైనారిటీ వర్గాల వారికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 12 శాతం రిజర్వేషన్ కల్పించాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదనే ఆంక్షను సడలించుకోవాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం 45/94 చట్టం తెచ్చి, భారత పార్లమెంటు ఆమోదం ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్పించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించనుంది. మన రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేసుకునే సౌలభ్యాన్ని పొందేందుకు వీలుగా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపింది.
మైనారిటీ యువత ఉపాధి కోసం ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఓన్ యువర్ ఆటో అనే వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టింది. డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని వాహన ఓనర్లుగా మార్చడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ స్కీమ్ ద్వారా మే 23, 2018 నాటికి 1,741 మందికి రూ.12.74 కోట్ల ఖర్చుతో ఆటోలు అందజేశారు. యువకులకు 50 శాతం సబ్సిడీపై ఆటోలు అందించారు.
తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్సీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం 4 సెప్టెంబర్, 2018న హైదరాబాద్ హజ్హౌస్ ప్రాంగణంలో చేపట్టింది. 500 వాహనాలు అందివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలివిడత 342 మంది మైనార్టీ నిరుద్యోగులకు రూ.25 కోట్ల విలువ చేసే మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్లను అందించింది. డ్రైవర్ సాధికారత కార్యక్రమం (డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం) ద్వారా మైనార్టీల్లోని పేదవర్గాలకు ఈ కార్లను పంపిణీ చేస్తున్నారు. గతంలో చిన్న చిన్న వాహనాలకు 30 శాతం సబ్సిడీతో అందించేవి. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వాహనాలనైనా 60 శాతం సబ్సిడీతో ఇస్తున్నది.
క్రిస్టియన్ మైనార్టీలకోసం డ్రైవర్ ఎంపవర్ మెంట్ స్కీం
క్రిస్టియన్ మైనార్టీ యువతకు అండగా నిలిచేలా ప్రభుత్వం డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది. క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద నిరుద్యోగ క్రిస్టియన్లకు 60 శాతం సబ్సిడీతో కార్లను అందజేస్తున్నారు. కార్లను ట్రావెల్స్ గా, క్యాబ్ మాదిరిగా నడుపుకొంటారు. ఈ పథకానికి 2016-17లో 75 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 21 మందిని అర్హులుగా ప్రకటించారు. వీరికి కార్లను అందజేసేందుకు ఫిబ్రవరి 2019లో ప్రభుత్వం రూ.93.31 లక్షలను విడుదల చేసింది. ఒక్కో కారుకు రూ.4,44,346 సబ్సిడీ ఇస్తున్నారు. కారు ఖరీదులో 60 శాతం సబ్సిడీగా ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నారు. వీరికి మలక్పేటలోని మారుతీ డ్రైవింగ్ స్కూల్లో మూడురోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 1, 2020న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 133 మంది క్రిస్టియన్ యువకులకు సబ్సిడీ పై కార్లను పంపిణీ చేశారు. 2018-19 సంవత్సరానికి ఈ పథకానికి 317 దరఖాస్తులు చేసుకోగా 133 మంది లబ్దిదారుల ఎంపిక జరిగింది.
మైనారిటీ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు లేరు. అందరూ డిప్యూటేషన్లపై పనిచేస్తున్నవాళ్లే. తెలంగాణ ఏర్పాటు కాక ముందున్న ప్రభుత్వాలు అనుసరించిన విధానమిది. 30 మంది ఉద్యోగులతో నామమాత్రంగా సాగుతున్న మైనారిటీ సంక్షేమశాఖను బలోపేతం చేసే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 66 ఉర్దూ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసింది. ఉర్దూ అకాడమీ సహాయంతో ఈ పోస్టుల భర్తీ కోసం 20 మే 2018న పరీక్ష నిర్వహించిన మైనారిటీ కార్పొరేషన్ 30 జూన్ 2018న ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఎంపికైన ఉర్దూ ఆఫీసర్లు జూలై 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో (ఉర్దూ విభాగంలో) విధులు నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీ.ఓ.నం.44ను 19 అక్టోబర్ 2015న జారీ చేసింది. వక్ఫ్ బోర్డు బలోపేతానికి ప్రభుత్వం 2016-17 బడ్జెట్లో రూ.65 కోట్లను కేటాయించింది. వక్ఫ్ సంస్థల్లో నిర్మాణాలు, మరమ్మత్తుల కోసం ప్రభుత్వం రూ. 53 కోట్ల గ్రాంటు అందించింది. గతంలో కేవలం నాలుగైదు కోట్ల గ్రాంటు మాత్రమే ఇచ్చేవారు. 11 చోట్ల ఉన్న వక్ఫ్ భూముల్లో నిర్మాణాలు చేపట్టడానికి ఆ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీని ద్వారా వక్ఫ్ బోర్డుకు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల ఆదాయం సమకూరుతుంది. వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటున్నది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయిలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సమన్వయ కమిటీలను నియమించింది. జామియా నిజామియాలో ఆడిటోరియం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.14.65 కోట్లు కేటాయించింది. నవంబర్ 2017 నాటికి ప్రభుత్వం వక్ఫ్ సంస్థకు రూ.130 కోట్లు ఖర్చుచేసింది.
ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత
ఒంటరి మహిళలకు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు మెయింటినెన్స్ అలవెన్సుగా ప్రతీ నెలా అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద 361 మందిని గుర్తించారు. కొవిడ్ తో పాటు కిడ్నీ, కాలేయం, క్యాన్సర్ బాధిత మహిళలకు వైద్యం చేయించేందుకు వక్ఫ్ బోర్డు వారికి ఆర్థిక చేయూత అందిస్తున్నది.
హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్హాల్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణానికి రూ.40 కోట్లను మంజూరు చేసింది. ఇందుకోసం కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ముస్లింల కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే వేదికగా ఈ హాల్ ఉపయోగపడుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాష పరిరక్షణ, వికాసం కోసం నిధులను మంజూరు చేసి, మౌలిక సదుపాయాల అవసరాలు గల ఉర్దూ మీడియం పాఠశాలలకు సహాయం చేయడానికి పథకాలను అమలు చేసింది. ఉర్దూ ఘర్ కం షాదీఖానాల నిర్మాణంతోపాటు ఉర్దూ వార్తా పత్రికలు, జర్నలిస్టులు, పాఠశాలలను ప్రోత్సహిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో క్వామీ జబాన్ మాస పత్రిక ముద్రణ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారం, మగ్దూమ్ పురస్కారం, జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నారు. ఉత్తమ ఉర్దూ స్టూడెంట్ అవార్డు, ఉర్దూభాషలో ప్రచురితమైన పుస్తకాలకు ఉత్తమ పురస్కారాలు ఇస్తున్నారు. ఉర్దూ రాత ప్రతులకు ఆర్థిక సహాయం, ఉర్దూ గ్రంథాలయాలకు పుస్తకాల రూపంలో ఆర్థిక సహాయం, ఉర్దూ వార్తా సంస్థలకు ఆర్ధిక సహాయం, ఉర్థూ వార పత్రికలకు ఆర్థిక సహాయం, ఉర్దూ విలేకరులకు ఆర్థిక సహాయం, అరుదైన పుస్తకాల ప్రచురణలకు ఆర్థిక సహాయం, పాఠ్య పుస్తకాల ప్రచురణ, ఉర్దూ మీడియం పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, చిన్న పత్రికలకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉర్దూ అకాడమీకి ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.20 కోట్లను ఉర్దూ భాషాభివృద్ధికి, రూ.8 కోట్లను షాదీఖానాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.
విద్యార్దులకు ఉర్దూ భాషను మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ గా తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం 19 మే, 2015న ఉత్తర్వులను జారీ చేసింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ను ఉర్దూ భాషలో నిర్వహించాలని 21 జనవరి, 2017న ప్రధాని మోదీకి లేఖ రాశారు. నీట్ ను ప్రస్తుతం 10 భాషల్లో నిర్వహిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఉర్దూ భాషలో చదివే విద్యార్థుల సౌలభ్యం కోసం ఉర్దూలోనూ పరీక్షరాసే అవకాశం కల్పించాలని లేఖలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం అంగీకరించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి నీట్ పరీక్షను ఉర్దూ మీడియంలో నిర్వహించాలని సుప్రీం కోర్టు కూడా 13 ఏప్రిల్, 2017న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నీట్ ను ఉర్దూలో నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొంది.