యాదాద్రి భువనగిరి: వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరువు కల్పించేలా సైతం పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది బడ్జెట్లో చేనేత రంగానికి పెద్దపీఠ వేసి రూ.338కోట్లను కేటాయించిన ప్రభుత్వం…చేనేత కార్మికులకు కొండంత భరోసాగా నిలిచిన త్రిఫ్ట్ పథకాన్ని తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు ఇప్పటికే రూ.30కోట్లను సైతం విడుదల చేసింది. 2017 సంవత్సరంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ త్రిఫ్ట్కు అనుబంధంగా నేతన్నకు చేయూత పేరుతో పోచంపల్లి నుంచే అంకురార్పణ చేశారు.
గత యేడాది ఈ పథకంలో కార్మికులకు రూ.33కోట్ల వరకు లబ్దికలగగా.. ఈ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగింపుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మిక కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. త్రిఫ్ట్లో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు గాను చేనేత జౌళీ శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.
రంగురంగుల చీరలనీ ప్రపంచానికి అందించిన చేనేత బతుకులకు భరోసా కల్పించేలా దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోంది. త్రిఫ్ట్, చేనేత మిత్ర వంటి పథకాలు చేనేత కార్మిక కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తూ వస్తున్నాయి. 2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించగా..యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో నేతన్నకు చేయూత పేరుతో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
ప్రతి నెలా 8 శాతం పొదుపు చేసిన కార్మికుని ఖాతాలో 16శాతం వాటా ధనంగా ప్రభుత్వం మూడేళ్ల వ్యవధి ముగిశాక అందజేస్తోంది. గత యేడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేనేతకు చేయూత పేరుతో జిల్లాలోని 5,400 మంది కార్మికులకు రూ.33 కోట్ల వరకు పొదుపు నగదును అందజేసింది. అలాగే పేరుకుపోయిన వస్త్ర నిల్వలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది.
అయితే గత ఏడాది లాక్డౌన్లో చేనేతకు చేయూత పథకం కార్మికులకు అండగా నిలవడంతో.. ఈ ఏడాది కూడా ఆ పథకాన్ని కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో కార్మికులు కనిష్టంగా రూ.200 నుంచి రూ.1500 వరకు పొదుపు చేసేందుకు అవకాశం ఉంది. పథకం కొనసాగింపుకు సంబంధించిన రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ప్రభుత్వం నుంచి వెలువడనున్నాయి.
నూలు కొనుగోళ్ల పైనా 40 శాతం సబ్సిడీ
చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 40 శాతం సబ్సిడీ ఇచ్చి చేనేత మిత్ర పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇందులో 35 శాతాన్ని కార్మికులకు చెల్లిస్తుండగా.. మిగతా 5 శాతం సబ్సిడీని సంఘానికి లేకుంటే గ్రూపు లీడర్కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎన్హెచ్డిసి) సంస్థలో గానీ, ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లిస్తోంది. జనగామ, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు.
2018 జూన్లో ప్రారంభమైన ఈ పథకంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 6 వేల మంది రూ.3.86కోట్ల వరకు లబ్ధి పొందారు. సిల్కుకు సంబంధించిన నూలు కొనుగోళ్లపై ఏడాదిలో 9 సార్లు, కాటన్పై 12 సార్లు లబ్ది పొందే అవకాశం ఉంది. ఈ లెక్కన మగ్గంనేసే నేత నెలకు రూ.4-5వేలను, అనుబంధ కార్మికుడు రూ.1-2వేల వరకు లబ్ది పొందవచ్చు. జిల్లాలో 1,691 బిల్లులకు గాను రూ.4.11కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు 1,601 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చి కార్మికుల ఖాతాలో రూ.3.86కోట్లను జమ చేసింది. ఇంకా కొద్దిపాటిగా మిగిలిపోయిన చెల్లింపులు జరిపితే అనుకున్న లక్ష్యం నెరవేరినట్లేనని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
8వేల మందికి పైగా లబ్ధి
జిల్లాలో 20వేల వరకు చేనేత కుటుంబాలు మగ్గాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. చేనేత, జౌళీ శాఖ అధికారుల సర్వే ప్రకారం.. జియో ట్యాగింగ్లో 5,890 మగ్గాలు ఉండగా..5 వేల మంది ఈ పథకంలో చేరారు. ఇప్పటివరకు యాభై శాతం మందే త్రిఫ్ట్ పథకంలో లబ్ధి పొందుతున్నారు. వివిధ కారణాల వల్ల ఈ పథకంలో లబ్ధిదారులకు చేరలేకపోయారు. ఫలితంగా ప్రభుత్వం అందించే సాయాన్ని ఎన్నో కుటుంబాలు పొందలేకపోతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా చేనేత, జౌళీ శాఖ జిల్లా వ్యాప్తంగా ఏ ఏడాది ఆరంభంలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించి కొత్తగా 900 మంది వివరాలను సేకరించారు. ఈ లెక్కన మరమగ్గాల కార్మికులతో పాటు అనుబంధ కార్మికులు కలుపుకుని జిల్లాలో త్రిఫ్ట్ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య 8వేలకు పైగా చేరే అవకాశం ఉంది. జియో ట్యాగ్ కలిగిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు ఎప్పటికప్పుడు గుర్తించి ఈ పథకంలో మరింతమంది లబ్ది పొందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విధివిధానాలు వచ్చిన వెంటనే అమలు : వెంకటేశం, అసిస్టెంట్ డైరెక్టర్, చేనేత, జౌళీ శాఖ
కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే అమలుచేస్తున్న త్రిఫ్ట్, చేనేత మిత్ర పథకాలు చేనేత కార్మిక కుటుం బాలకు గొప్ప మేలును చేకూర్చుతున్నాయి. చేనేత మిత్ర పథకంలో ప్రతి నెలా కొంత స్థిర ఆదాయం కార్మికులకు సమకూరుతుంది. త్రిఫ్ట్ పథకం కొనసాగింపుకు సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం నుంచి రానున్నాయి. ఆ వెను వెంటనే పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం. నూరుశాతం మంది కార్మికులకు ఈ పథకంలో లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.