హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకుగాను తనకు ఈ అవార్డు వచ్చినట్లు హిమాన్షు ట్విటర్లో చెప్పారు. గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ అవార్డు తనకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ట్వీట్లో హిమాన్షు అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తనకు మార్గదర్శకుడిగా నిలిచిన తన తాత, సీఎం కేసీఆర్కు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ కార్యక్రమం చేపట్టిన గంగాపూర్-యూసుఫ్ఖాన్పల్లి వాసులకు, తన గురువులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.
ఏంటీ డయానా అవార్డు?
అసలు ఈ డయానా అవార్డు ఏంటన్నది కూడా హిమాన్షు మరో ట్వీట్లో వివరించారు. 25 ఏళ్ల కిందట మరణించిన వేల్స్ యువరాణి డయానా పేరు మీదుగా ఈ అవార్డు ఏర్పాటు చేశారు. 9 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతీయువకులు చేస్తున్న సామాజిక లేదా మానవతావాద కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డు ప్రకటిస్తారు. తన SHOMA కార్యక్రమ ఉద్దేశమేంటో చెబుతూ ఓ వీడియోను కూడా హిమాన్షు పోస్ట్ చేశారు.
ఆహార ఉత్పత్తుల్లో కల్తీ అంశంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించడంతోపాటు కల్తీ లేని ఉత్పత్తులను చేయడంలో వాళ్లు సాధికారత సాధించే దిశగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ కోసం 12 ప్రతిష్టాత్మక లక్ష్యాలను కూడా హిమాన్షు వివరించారు. చిన్న పరిశ్రమల ఏర్పాటుతో గ్రామాల్లో అసలు పేదరికం లేకుండా చేయడం, స్వయం ఉపాధి కల్పించి అసలు ఆకలి సమస్య లేకుండా చేయడం, కల్తీ లేని ఆహార ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యంగా జీవనం సాగించేలా చేయడం, సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.