అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తారు. 10 గేట్లు రెండు మీటర్లు, మరో 10 గేట్లు ఒక మీటర్ ఎత్తి 45,730 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శుక్రవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 58,784 క్యూసె క్కులు ఉండగా, అవుట్ఫ్లో 61,557 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టా నికి గాను, ప్రస్తుతం 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్లు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో పాటు టీబీ డ్యాం వరద తోడవడంతో ఆర్డీఎస్ ఆనకట్ట వరద నీరు చేరుతోంది. శుక్రవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 43,627 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 43,200 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10.8 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 427 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.