హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రులకు అధిక ధరకు కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను అమ్మడాన్ని భారత్ బయోటెక్ సంస్థ సమర్థించుకున్నది. ప్రస్తుతం ఒక డోసుకు రూ.150 చొప్పున కేంద్ర ప్రభుత్వానికి కోవాగ్జిన్ టీకాలను భారత్ బయోటెక్ సంస్థ అమ్ముతున్నది. కానీ సుదీర్ఘ కాలం ఇంత తక్కువ ధరకే తమ టీకాలను అమ్మలేమని ఆ సంస్థ పేర్కొన్నది. అందుకే ప్రైవేటు మార్కెట్లో అధిక ధరకు కోవాగ్జిన్ టీకాలను విక్రయిస్తున్నట్లు భారత్ బయెటెక్ సంస్థ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం భారత్ బయోటెక్ సంస్థ తన ఉత్పత్తిలో 50 శాతం టీకాలను కేటాయిస్తున్నది. తొలుత రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసును రూ.600, ప్రైవేటు హాస్పిటళ్లకు ఒక డోసును 1200 చొప్పున కోవాగ్జిన్ అందిచింది. అయితే ఇది సీరం ఇన్స్టిట్యూట్ అందిస్తున్న కోవీషీల్డ్ టీకా కన్నా ఎక్కువ ధర. కానీ భారత్ బయోటెక్ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుని రాష్ట్రాలకు కేవలం రూ.400కే డోసు టీకాను అందించింది. ఐసీఎంఆర్కు చెందిన వైరాలజీ ఇన్స్టిట్యూట్తో కలిసి భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు హాస్పిటళ్లకు ధరలు పెంచడం జరిగినట్లు భారత్ బయోటెక్ పేర్కొన్నది.